ఈ సంక్రాంతికి అగ్ర హీరోలు చిరంజీవి, బాలకృష్ణ ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహా రెడ్డి’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చారు. అయితే ఈ రెండు చిత్రాల్లో నాయిక మాత్రం ఒక్కరే. ఆమే అందాల తార శృతి హాసన్. తెలుగులో ఒక కమ్బ్యాక్ లాంటి జోరు చూపిస్తున్నదీ నాయిక. ఈ రెండు చిత్రాలు విడుదలై సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘ కొన్నేండ్ల కిందట ఇలాగే నేను నటించిన రెండు సినిమాలు ఒకే రోజున విడుదలయ్యాయి. మళ్లీ అది నా కెరీర్లో ఇప్పుడు పునరావృతం అయ్యింది. ఈ సంక్రాంతికి రెండు బిగ్ మూవీస్తో మీ ముందుకు రావడం సంతోషంగా ఉంది. ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’..చిత్రాల్లో భిన్నమైన పాత్రల్లో నటించాను. ‘వీరసింహా రెడ్డి’లో నా పాత్ర సరదాగా సాగుతుంది. ఫన్, కామెడీతో ఉంటుంది. ‘వాల్తేరు వీరయ్య’లో మరో తరహా క్యారెక్టర్ చేశాను. నేను నటించే పాత్రలు వెరైటీగా ఉండాలని ఎప్పుడూ కోరుకుంటా. ‘వాల్తేరు వీరయ్య’ స్క్రిప్ట్ విన్నప్పుడు అందులో నా పాత్ర చాలా నచ్చింది.
‘వీరసింహా రెడ్డి’లో కామెడీ చేశాను. ఎమోషన్ సీన్లలో భావోద్వేగాలు పలికించడం సులువు గానీ ప్రేక్షకుల్ని నవ్వించడం కష్టమని నా అభిప్రాయం. కామెడీ పండించడం సవాలు లాంటిది. చిరంజీవి, బాలకృష్ణ మంచి డ్యాన్సర్స్. వారితో కలిసి డ్యాన్సులు చేసేందుకు ఇబ్బంది పడలేదు. బాలకృష్ణతో ‘సుగుణ సుందరి’ పాటలో చేసిన స్టెప్పులకు మంచి పేరొచ్చింది. అలాగే చిరంజీవితో చేసిన ‘శ్రీదేవి..చిరంజీవి’ పాట కూడా బాగా హిట్టయ్యింది. నేను అదృష్టం కంటే శ్రమను, దేవుడిని నమ్ముతాను. నేను లక్కీ అని ఎవరైనా అంటే సంతోషమే. కొందరు నేను అన్లక్కీ అని కూడా అంటారు. ఇలాంటి ట్యాగ్స్ను సీరియస్గా తీసుకోను. తెలుగు ప్రేక్షకులు చూపించిన అభిమానం, అందించిన విజయాలు, ఇచ్చిన గుర్తింపు ఎప్పటికీ మర్చిపోలేను. ‘క్రాక్’ మూవీ తర్వాత టాలీవుడ్లో వరుస అవకాశాలు రావడం సంతోషంగా ఉంది. సినిమాల్లో ఇంతకాలం ఉండాలని ప్లాన్ చేసుకోలేదు. నాకు సినిమాలంటే ఇష్టం, ఇక్కడ పనిచేయడం ఇష్టం. చిన్నప్పుడు సంక్రాంతి బాగా సెలబ్రేట్ చేసుకునేవాళ్లం. ఇప్పుడు పండుగకు పూజ చేసి, కుటుంబంతో కాసేపు గడుపుతుంటా’ అని చెప్పింది.