Shruti Hassan | సోషల్మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది అగ్ర కథానాయిక శృతిహాసన్. అభిమానులతో తరచుగా మాటామంతీ నిర్వహిస్తూ తన వ్యక్తిగత విషయాలను కూడా షేర్ చేస్తుంటుంది. తాజాగా ఈ భామ తన ప్రియుడు శంతను హజారికాతో కలిసి సోషల్మీడియాలో అభిమానులతో ముచ్చటించింది. ఈ సందర్భంగా వారు అడిగిన ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానమిచ్చింది. శంతను హజారికాలో బాగా నచ్చిన అంశాలు ఏమిటనే ప్రశ్నకు ‘అతను అద్భుతమైన ప్రతిభావంతుడు.
సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా ఎక్కువ. నేను బాధలో ఉన్న ప్రతీ సందర్భంలో నవ్వించే ప్రయత్నం చేస్తాడు. తన కళ్ల ద్వారానే ప్రేమను ప్రకటిస్తాడు’ అంటూ ప్రియుడిని ప్రశంసలతో ముంచెత్తింది. ఏదైనా చిన్న గొడవలు జరిగితే ముందు ఎవరు సారీ చెబుతారని మరో అభిమాని అడగ్గా..‘ఆ విషయంలో మాత్రం నేను అస్సలు కాంప్రమైజ్ కాను. ముందుగా అతనే సారీ చెప్పాలి’ అని శృతిహాసన్ పేర్కొంది. ఈ ఏడాది ఈ భామ తెలుగులో ‘వాల్తేరు వీరయ్య’ ‘వీరసింహా రెడ్డి’ చిత్రాలతో మంచి విజయాలను సొంతం చేసుకుంది.