Shruti Haasan | ‘ముప్ఫైఏళ్లు దాటాకా నాలో పరిపక్వత పెరిగింది. అందుకే ప్రశాంతంగా ఉండగలుగుతున్నాను’ అంటున్నది అందాలభామ శ్రుతిహాసన్. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన జీవితంలో వచ్చిన మార్పుల విషయంపై స్పందించింది శ్రుతి. ‘ నేనిప్పుడు చాలా హాయిగా ప్రశాంతంగా ఉన్నాను. మనసు బాగుంటే మనిషి ఆటోమేటిగ్గా ప్రశాంతంగా ఉంటాడు. కొన్నాళ్లక్రితం వరకూ నా పెళ్లి విషయంలో లెక్కకుమించిన వెటకారాలను ఎదుర్కొన్నాను. నాకు ముప్పై ఏళ్లు దాటాయని నాకే గుర్తుచేసేవారు.
నాకంటే నా పెళ్లి గురించి వీళ్లకే బాధ ఎక్కువ. అసలు ముప్పైఏళ్లు దాటినా పెళ్లి చేసుకోకపోవడం నేరమా? దానివల్ల దేశం ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందా? ఈ వ్యవహారంపై ఇదివరకూ చాలా ఒత్తిడికి లోనయ్యేదాన్ని. ఇప్పుడైతే నాకు ఆ బాధలేదు. హాయిగా జీవితాన్ని ఆస్వాదిస్తున్నాను. కారణం.. వాళ్లను పట్టించుకోవడం మానేశాను. నన్ను బాధపెట్టి ఆనందించాలనుకునేవాళ్లకు ఇదే నేను వేసే శిక్ష. ఇంతకు మించిన శిక్ష మరొకటి ఉండదు’ అంటూ చెప్పుకొచ్చింది శ్రుతిహాసన్.