మహారాష్ట్ర మహోన్నత జానపద కళాకారిణి, దేశభక్తురాలు విఠాబాయి భౌమాంగ్ నారాయణగాంకర్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న బాలీవుడ్ పానిండియా చిత్రం ‘విఠా’. ఇందులో విఠాబాయిగా శ్రద్ధాకపూర్ కనిపించనున్న విషయం తెలిసిందే. మరాఠీ దర్శకుడు సంజయ్ జాదవ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని లోక్మాన్య ప్రొడక్షన్స్ నిర్మిస్తున్నది. ఇదిలావుంటే.. విఠాబాయి పాత్ర గొప్పదనం గురించి ఇటీవల శ్రద్ధాదాస్ మాట్లాడుతూ ‘పుణ్యం చేసుకుంటే తప్ప ఇలాంటి పాత్రలు దక్కవు. ఈ విషయంలో నేనెంతో ఆనందిస్తున్నా, గర్విస్తున్నా. విఠాబాయి గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత ఒక నటిగా నాకు ఇంతకు మించిన ఛాలెంజ్ మరొకటి లేదని అర్థమైంది. కళను ఓ తపస్సుగా, వేదికను ఓ దేవాలయంలా భావించిన గొప్ప కళాకారిణి విఠాబాయి.
స్టేజ్పై ప్రదర్శన ఇస్తుండగా ప్రసవవేదన మొదలైతే.. ఏమాత్రం తడబడకుండా, వేదిక వెనక్కు వెళ్లి, ఓ బిడ్డకు జన్మనిచ్చి, సర్జికల్ పరికరాలు అందుబాటులో లేకపోవడంతో రాతితో బొడ్డు పేగును కోసి, బిడ్డను భద్రం చేసి, ఆ వెంటనే ఏమీ జరగనట్టుగానే తిరిగొచ్చి, మిగిలిన ప్రదర్శనను పూర్తిచేసిన గొప్ప కళాకారిణి విఠాబాయి. భారత్-చైనా యుద్ధ సమయంలో ఆమె కళారూపాలు జనంలో దేశభక్తిని పురిగొల్పాయి. యుద్ధభూమిలో అలసిన సైనికులకు విఠాబాయి ప్రదర్శనలు మానసిక ఉల్లాసాన్నిచ్చాయి. జానపద కళల్ని బతికించడం కోసం ఆమె పడ్డ తపన, ఎదుర్కొన్న పేదరికం, సామాజిక వివక్ష ఇవన్నీ ఈ బయోపిక్ కళ్లకు కడుతుంది’ అని తెలిపింది శ్రద్ధాకపూర్.