Chandrababu Naidu | తెలుగు రాష్ట్ర రాజకీయ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే నాయకుడు నారా చంద్రబాబు నాయుడు. అత్యధిక కాలం పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఈ నేత, 75 ఏళ్ల వయస్సులో కూడా అదే ఉత్సాహంతో ప్రజాసేవలో నిమగ్నమై ఉన్నారు. తాజాగా ఆయన బయోపిక్లో నటించాలనే ఆసక్తి వ్యక్తం చేసినవారిలో ప్రముఖ కన్నడ నటుడు శివరాజ్ కుమార్ కూడా చేరారు. కన్నడ కంఠీరవ డా. రాజ్కుమార్ వారసుడైన శివరాజ్ కుమార్, దాదాపు నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. అభిమానులు ప్రేమగా ‘శివన్న’ అని పిలుచుకునే ఈ స్టార్ హీరో ఇప్పుడు తెలుగులో కూడా వరుస సినిమాలతో అలరించేందుకు సిద్ధమయ్యారు.
ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న ‘పెద్ది’ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య బయోపిక్లో ప్రధాన పాత్రతో కనిపించనున్నారు. రీసెంట్గా విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న శివరాజ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. పెద్ది’ సినిమాలో నా పాత్ర చాలా ప్రత్యేకం. గుమ్మడి నర్సయ్య బయోపిక్ ద్వారా గొప్ప వ్యక్తి కథను చెబుతున్నాం. ఈరోజుల్లో అలాంటి విలువలు ఉన్న వ్యక్తుల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి అని చెప్పారు. అవకాశం వస్తే నారా చంద్రబాబు నాయుడు గారి బయోపిక్లో కూడా తప్పకుండా నటిస్తా… అది నాకు గౌరవంగా భావిస్తా,” అని శివన్న తెలిపారు.
శివరాజ్ కుమార్ మాట్లాడుతూ నందమూరి బాలకృష్ణతో తనకున్న అనుబంధాన్ని ప్రత్యేకంగా గుర్తుచేశారు. బాలయ్య గారు మా ఫ్యామిలీ లాంటివారు… చాలా క్లోజ్. ఆయనతో ఉన్న బంధం నాకు ఎంతో విలువైనది,” అని చెప్పారు. తెలుగు ప్రేక్షకులపై తనకున్న ప్రేమని కూడా వ్యక్తపరిచారు .. ఆంధ్ర ఫుడ్ అంటే నాకు చాలానే ఇష్టం. రామ్ చరణ్ చాలా మంచి మనసున్న వ్యక్తి. ఆయనతో పనిచేయడం ఆనందంగా ఉంది,” అని చెప్పారు. అలాగే, ఉపేంద్ర దర్శకత్వం వహించిన కల్ట్ క్లాసిక్ ‘ఓం’ కు సీక్వెల్ వస్తే కూడా నటించడానికి సిద్ధమేనని చెప్పారు.శివరాజ్ కుమార్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగు – కన్నడ సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. చంద్రబాబుగారి బయోపిక్ ఏదో ఒక రోజు తెరకెక్కితే మాత్రం, అందులో శివన్న కనిపిస్తారా అన్న ఆసక్తి అభిమానుల్లో ఉంది.