ముంబై: ఆస్కార్స్ 2022 బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో పోటీ పడేందుకు ఇండియా నుంచి అధికారిక ఎంట్రీ కోసం ప్రక్రియ మొదలైంది. దీనికోసం 15 మంది జడ్జ్ల జ్యూరీ మొత్తం 14 సినిమాలను చూడనుంది. వీటిలో నుంచి ఒక సినిమాను ఎంపిక చేయనున్నారు. షార్ట్లిస్ట్ అయిన మూవీస్లో విద్యా బాలన్ నటించిన షేర్ని, విక్కీ కౌషల్ నటించిన సర్దార్ ఉధమ్ ఉన్నాయి. ఈ రెండు సినిమాలు ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్లో ఉన్నాయి.
మనిషి, జంతువుల మధ్య నెలకొన్న సంఘర్షణ తాలూకు కథాంశంతో తెరకెక్కిన షేర్ని విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇందులో నటనకుగాను విద్యా బాలన్పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇక షూజిత్ సిర్కార్ తెరకెక్కించిన సర్దార్ ఉధమ్ కూడా పాజిటివ్ రీవ్యూలను సొంతం చేసుకుంది. ఇందులో విప్లవకారుడు సర్దార్ ఉధమ్ సింగ్ పాత్రలో విక్కీ కౌశల్ మెప్పించాడు. జలియన్ వాలా భాగ్ హత్యాకాండకు ప్రతీకారం తీర్చుకునే విప్లవకారుడి జీవితమే ఈ చిత్ర కథాంశం.
షేర్ని, సర్దార్ ఉధమ్లతోఆటు నామినేషన్ల రేసులో తమిళ సినిమా మండేలా, మలయాళం మూవీ నయాట్టు ఉన్నాయి. వచ్చే ఏడాది మార్చిలో ఆస్కార్స్ 2022 విజేతలను ప్రకటించనున్నారు. ఇండియా నుంచి అధికారిక ఎంట్రీ కోసం మొత్తం 14 సినిమాలు పోటీ పడుతుండగా.. 15 మంది సభ్యుల జ్యూరీ కోల్కతాలోని బిజోలీ సినిమాలో వాళ్లు ఈ మూవీస్ను చూస్తున్నారు.