‘పుష్ప’ చిత్రంలోని శ్రీవల్లి పాత్ర ద్వారా దేశవ్యాప్తంగా ప్రేక్షకులకు చేరువైంది కన్నడ సోయగం రష్మిక మందన్న. ప్రస్తుతం ఈ భామ తెలుగు, తమిళ భాషలతో పాటు బాలీవుడ్లోనూ బిజీగా ఉంది. హిందీ చిత్రసీమలో ఆమె తొలి చిత్రం ‘గుడ్బై’ అక్టోబర్ 7న ప్రేక్షకుల ముందుకురానుంది. వికాస్భల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అమితాబ్బచ్చన్ ప్రధాన పాత్రలో నటించారు. ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కించారు. ఈ సినిమాలో తాను తారా భల్లా అనే యువతిగా కనిపిస్తానని, కుటుంబ ప్రేమానుబంధాల గొప్పతనాన్ని ఆవిష్కరించే చిత్రమిదని రష్మిక మందన్న పేర్కొంది.
మూఢ విశ్వాసాలు, ఆచార వ్యవహారాల్ని ప్రశ్నిస్తూనే భావోద్వేగాల్ని చక్కగా అర్థం చేసుకునే అమ్మాయిగా తారా భల్లా పాత్ర తన కెరీర్లో ప్రత్యేకమని చెప్పింది. అయితే ఈ సినిమా హిందీ డబ్బింగ్ విషయంలో కాస్త ఇబ్బంది పడ్డానని తెలిపింది. రష్మిక మందన్న మాట్లాడుతూ ‘నా మాతృభాష కన్నడ కాకుండా ఇతర ఏ భాషల్లోనైనా నాకు డబ్బింగ్ చెప్పడం కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. హిందీలో మరింత కష్టంగా అనిపించింది. చివరకు చక్కటి శిక్షణతో విజయవంతంగా డబ్బింగ్ పూర్తిచేశా’ అని చెప్పింది. ప్రస్తుతం ఈ భామ తెలుగులో ‘పుష్ప-2’, ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్ చిత్రాల్లో కథానాయికగా నటిస్తున్నది.