Sharwanand | టాలీవుడ్ యాక్టర్ శర్వానంద్ తన సినీ కెరీర్లో మరో కీలక అడుగు వేశారు. తాజాగా ఆయన OMI పేరుతో ఓ మల్టీ డైమెన్షనల్ సంస్థను స్థాపించారు. ఇది కేవలం సినిమా నిర్మాణ సంస్థ మాత్రమే కాకుండా, వెల్నెస్ ప్రొడక్ట్స్, హాస్పిటాలిటీ రంగాల్లో సేవలందించబోయే వినూత్న వేదికగా రూపుదిద్దుకుంటోంది. ఈ సంస్థ అధికారిక లోగోను మంగళవారం భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన శర్వానంద్కు శుభాకాంక్షలు తెలియజేస్తూ, “ఓమ్ (ఓంకారం) మరియు ఐ (నేను) కలయికగా రూపొందిన OMI పేరు ఎంతో ఆసక్తికరం. ఇది భవిష్యత్తులో ఎంతో మంది టాలెంట్కి వేదిక అవుతుంది” అని ప్రశంసించారు.
“OMI…నా విజన్, నా బాధ్యత. ఇది కేవలం ఒక కంపెనీ కాదు, ఒక కల. ఇది క్రియేటివిటీకి పునాదిగా నిలుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్టిస్టులకు, క్రియేటర్లకు ఇది ఓ వేదిక అవుతుంది. కొత్త కథలు చెప్పేందుకు, వినూత్న ఆలోచనలను పరిచయం చేయడానికే ఈ ప్రయాణం,” అని శర్వా వివరించారు. అలాగే, “ఈ ప్రయాణాన్ని ఒంటరిగా ప్రారంభిస్తున్నా కానీ నిజాయితీ, స్పష్టత, మరియు సంకల్పంతో ముందుకు సాగుతున్నాను. ప్రతి అడుగు బాధ్యతతో వేస్తున్నాను,” అని చెప్పారు. ప్రస్తుతం శర్వానంద్ ‘నారీ నారీ నడుమ మురారి’ అనే సినిమా షూటింగ్లో పాల్గొంటున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరిలో విడుదల కానుంది. ఇందులో ఆయన ఒక వినూత్న పాత్రలో మెరవనున్నారు.
అలాగే, బైక్ రేసింగ్ నేపథ్యంతో రూపొందుతోన్న మరో యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్లో కూడా ఆయన నటిస్తున్నారు. ఇదిలా ఉంటే, ‘భోగి’ అనే విభిన్న కాన్సెప్ట్తో మరో సినిమా ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ చిత్రాలు పూర్తి కాకముందే నిర్మాతగా అడుగుపెట్టి తన సృజనాత్మకతను మరింత విస్తరించాలనే దిశగా శర్వా అడుగులు వేస్తున్నారు. టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న శర్వానంద్ ఇప్పుడు నటుడిగానే కాకుండా, కొత్త తరం నిర్మాతగా మారాలని సిద్ధమవుతున్నారు. OMI ద్వారా ఆయన తీసుకురాబోయే కంటెంట్పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. సినిమాలతో పాటు వెల్నెస్, హాస్పిటాలిటీ రంగాల్లో ప్రవేశించడం ద్వారా శర్వా తన బ్రాండ్ను విస్తరించబోతున్నారు.