Sharwanand | టాలీవుడ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం వరుస విజయాలతో మంచి జోష్లో ఉన్నారు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ‘నారీ నారీ నడుమ మురారి’ కుటుంబ ప్రేక్షకులను అలరించి బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. అలాగే ఇటీవల విడుదలైన మోటోక్రాస్ రేసింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ‘బైకర్’ కూడా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందింది. ఈ విజయాల ఊపుతో శర్వానంద్ ఇప్పుడు వరుసగా విభిన్న కథలను ఎంపిక చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం దర్శకుడు సంపత్ నంది తెరకెక్కిస్తున్న ‘భోగి’ చిత్రంలో శర్వానంద్ నటిస్తున్నారు. 1960ల నాటి నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయతి కథానాయికలుగా కనిపించనున్నారు. ఈ సినిమా చిత్రీకరణ వేగంగా కొనసాగుతోంది.
ఇదిలా ఉండగా, ఇప్పుడు శర్వానంద్ తన తదుపరి చిత్రాన్ని హాస్య కథా చిత్రాల దర్శకుడు శ్రీను వైట్లతో చేయడానికి సిద్ధమైనట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ సినిమాలో శ్రీను వైట్ల మార్క్ కామెడీకి తోడు ‘కాలయానం’ అనే వైవిధ్యమైన అంశాన్ని జోడిస్తున్నట్లు సమాచారం. హాస్యంతో పాటు సైన్స్ ఫిక్షన్ అంశాలు కలిస్తే ప్రేక్షకులకు కొత్త తరహా అనుభూతి కలుగుతుందని చిత్రబృందం భావిస్తున్నట్లు తెలుస్తోంది. మొదట ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించాల్సి ఉండగా, కొన్ని కారణాల వల్ల వారు ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారని సమాచారం. ఇప్పుడు ఈ చిత్రాన్ని నిర్మాత అనిల్ సుంకర తన నిర్మాణ సంస్థ ద్వారా నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. ‘నారీ నారీ నడుమ మురారి’ తర్వాత శర్వానంద్-అనిల్ సుంకర కాంబినేషన్లో వస్తున్న రెండో సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్పై మంచి అంచనాలు నెలకొన్నాయి.
జులై 2026 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని, వచ్చే సంక్రాంతికి చిత్రాన్ని విడుదల చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు సమాచారం. ఇక హీరోయిన్ ఎంపిక విషయంలో కూడా ఆసక్తికర చర్చ సాగుతోంది. తొలుత పూజా హెగ్డే, మమితా బైజు పేర్లు వినిపించినా, తాజా సమాచారం ప్రకారం మిస్ ఇండియా రన్నరప్ మానస వారణాసిని హీరోయిన్గా ఎంపిక చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల ‘కపుల్ ఫ్రెండ్లీ’ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న ఈ తెలుగమ్మాయి, శర్వానంద్ సరసన నటించేందుకు అంగీకరించినట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.ఒకవేళ ఇదే నిజమైతే శర్వానంద్-మానస జోడీ వెండితెరపై కొత్త ఫీల్ను తీసుకురావడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం కథా పనులు తుది దశకు చేరుకున్నాయని, త్వరలోనే చిత్రబృందంపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సమాచారం.