‘చైతన్య నాకు మంచి మిత్రుడు. వైవిధ్యమైన కథలను ఎంచుకొని సినిమాలు చేస్తున్నాడు. ఈ సినిమాలో ఓ మిడిల్ క్లాస్ వారియర్ చేసే పోరాటాన్ని చూపించారు’ అన్నారు హీరో ప్రియదర్శి. సోమవారం జరిగిన ‘షరతులు వర్తిస్తాయి’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చైతన్య రావు, భూమిశెట్టి జంటగా కుమారస్వామి (అక్షర) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 15న విడుదలకానుంది.
ఈ సందర్భంగా దర్శకుడు వేణు ఊడుగుల మాట్లాడుతూ..మన జీవితాల్లో జరిగిన సంఘటనలతో ఈ సినిమాను రూపొందించారని చెప్పారు. చిత్ర దర్శకుడు కుమారస్వామి మాట్లాడుతూ ‘చిన్నతనం నుంచి మా అమ్మ, నాన్న చెప్పిన మాటలను మనసులో పెట్టుకొని సామాజిక బాధ్యతతో ఈ సినిమా తీశా. అందరికి నచ్చే చిత్రమిది’ అన్నారు. తన క్యారెక్టర్కు చిరంజీవి పేరు పెట్టడంతో భయం, భక్తితో నటించానని, తన కెరీర్లో గుర్తుండిపోయే చిత్రమవుతుందని హీరో చైతన్య రావు తెలిపారు.