సామాజిక ఇతివృత్తాలకు వాణిజ్య అంశాల్ని కలబోసి జనరంజక చిత్రాల్ని అందించడంలో సిద్ధహస్తుడిగా పేరు తెచ్చుకున్నారు తమిళ అగ్ర దర్శకుడు ఎన్.శంకర్. ఆయన సినిమాలన్నీ భారీతనానికి చిరునామాగా నిలుస్తాయి. శంకర్ దర్శకత్వంలో రామ్చరణ్ కథానాయకుడిగా ఓ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. అగ్ర నిర్మాత దిల్రాజు తెరకెక్కించబోతున్న యాభయ్యవ చిత్రంగా ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే భారతీయ సినీవర్గాల్లో ఆసక్తినిరేకెత్తిస్తోంది. కొద్ది మాసాల క్రితం ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. తాజా సమాచారం ప్రకారం సెప్టెంబర్లో మొదటివారంలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా సినిమాను ప్రారంభించి అక్టోబర్లో సెట్స్మీదకు తీసుకురానున్నట్లు తెలిసింది. ఆరు నెలల్లో షూటింగ్ను పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారని చెబుతున్నారు. శంకర్ శైలి సోషల్ మెసేజ్ ఉన్న కాన్సెప్ట్ ఇదని..ఈ సినిమాలో రామ్చరణ్ పోలీస్ వృత్తి నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టి వ్యవస్థను సంస్కరించే వ్యక్తిగా కనిపిస్తాడని సమాచారం. ఈ సినిమాలోని కీలక అతిథి పాత్రలో దక్షిణాది అగ్ర నటుడు కనిపిస్తాడని అంటున్నారు. ఈ చిత్రంలో కైరా అద్వాణీ కథానాయికగా నటిస్తోంది. భారీ నిర్మాణ వ్యయంతో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించబోతున్నారు.