Thalaivar 173 | ఇండియన్ సినీ ఇండస్ట్రీలో దిగ్గజాలుగా వెలుగొందుతున్న రజనీకాంత్, కమల్ హాసన్ దశాబ్దాల తర్వాత ఒకే ప్రాజెక్ట్ కోసం చేతులు కలపడం ఇప్పటికే దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. కమల్ హాసన్ సొంత నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ నిర్మిస్తున్న రజనీకాంత్ 173వ చిత్రం (Thalaivar 173)పై రోజుకో ఆసక్తికరమైన అప్డేట్ వెలుగులోకి వస్తోంది.మొదట ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సీనియర్ దర్శకుడు సుందర్.సి దర్శకత్వం వహిస్తారని ప్రచారం జరిగినప్పటికీ, అనివార్య కారణాల వల్ల ఆయన ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. దాంతో ఈ బాధ్యతను యువ దర్శకుడు సిబి చక్రవర్తికి అప్పగించారు. శివకార్తికేయన్తో తీసిన ‘డాన’ చిత్రంతో బ్లాక్బస్టర్ అందుకున్న సిబి, ఇప్పుడు తలైవర్ను డైరెక్ట్ చేసే అరుదైన అవకాశం దక్కించుకోవడం విశేషం.
ఇక ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న అనిరుధ్ రవిచందర్ పేరు వినిపించగానే అంచనాలు మరింత పెరిగాయి. యూత్ఫుల్ బీట్లతో పాటు మాస్ ఎలిమెంట్స్ను అద్భుతంగా మేళవించే అనిరుధ్ ఈ ప్రాజెక్ట్కు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. అయితే, ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతున్న మైండ్బ్లోయింగ్ వార్త ఏమిటంటే… విలన్ పాత్ర కోసం విజనరీ డైరెక్టర్ శంకర్ని సంప్రదించారట. రజనీకాంత్–శంకర్ కాంబినేషన్లో వచ్చిన ‘శివాజీ’, ‘రోబో’, ‘2.0’ వంటి విజువల్ వండర్స్ బాక్సాఫీస్ను షేక్ చేసిన సంగతి తెలిసిందే. అలాంటి దర్శకుడు ఈసారి నటుడిగా, అదీ ప్రతినాయకుడిగా రజనీకాంత్కు ఎదురెళ్లే అవకాశముండటంతో అభిమానుల్లో ఎక్స్సైట్మెంట్ పెరుగుతోంది.
సమాచారం ప్రకారం, దర్శకుడు సిబి చక్రవర్తి చెప్పిన కథ, విలన్ పాత్రలోని వైవిధ్యం శంకర్ను ఆకట్టుకున్నాయని, ఆయన కూడా ఈ ప్రాజెక్ట్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే దిశగా ఉన్నారని టాక్ వినిపిస్తోంది. ఇది నిజమైతే, ఇండియన్ సినీ చరిత్రలో ఒక అరుదైన కాంబినేషన్గా నిలిచే అవకాశం ఉంది. ఇదే సమయంలో నిర్మాత కమల్ హాసన్ కూడా ఈ చిత్రంలో ఒక పవర్ఫుల్ అతిథి పాత్రలో కనిపించనున్నారనే ప్రచారం హైప్ను మరింత పెంచుతోంది. ఇప్పటికే నిర్మాతగా వ్యవహరిస్తున్న ఆయన, స్క్రీన్పై కూడా కనిపిస్తే ఇది ఫ్యాన్స్కు డబుల్ ట్రీట్ అవుతుంది. ప్రస్తుతం రజనీకాంత్ ‘ జైలర్2’ షూటింగ్తో బిజీగా ఉండగా, అది పూర్తయ్యిన వెంటనే ఈ చిత్రం సెట్స్పైకి వెళ్లనుంది. భారీ బడ్జెట్తో తెరకెక్కనున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ను 2027 సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.