సమంత టైటిల్ రోల్ని పోషిస్తున్న పౌరాణిక ప్రణయ గాథ ‘శాకుంతలం’. మహాకవి కాళిదాసు రచించిన ‘అభిజ్ఞాన శాకుంతలం’ కావ్యం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. గుణశేఖర్ దర్శకుడు. ఫిబ్రవరి 17న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమాలోని ‘రుషి వనంలోన..’ అనే పాటను ఇటీవల విడుదల చేశారు. మణిశర్మ స్వరాల్ని సమకూర్చిన ఈ పాటకు శ్రీమణి సాహిత్యాన్నందించారు. సిధ్శ్రీరామ్, చిన్మయి ఆలపించారు. ‘స్వయం వరమేదీ జరుగలేదే…స్వయంగా తానే వలచినాడే..చెరకు శరమే విసిరినాడే, చిగురు యదనే గెలిచినాడే’ అంటూ సాగే ఈ గీతం దుష్యంతుడి, శకుంతల ప్రణయభావనలకు అద్దం పట్టేలా ఉంది. ఈ సినిమాలో ఈ పాట ప్రత్యేకాకర్షణగా నిలుస్తుందని, దృశ్యపరంగా కనులవిందుగా ఉంటుందని చిత్రబృందం పేర్కొంది.