జమ్ములోని ప్రఖ్యాత వైష్ణోదేవి ఆలయాన్ని బాలీవుడ్ అగ్ర నటుడు షారుఖ్ఖాన్ దర్శించుకున్నారు. మంగళవారం అర్ధరాత్రి ఆలయానికి చేరుకున్న ఆయన అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారని తెలిసింది. ఆలయ సందర్శనం సందర్భంగా షారుఖ్ఖాన్ ఎక్కడా మీడియా కంటబడకుండా జాగ్రత్త పడ్డారు. తన అనుచరులతో కలిసి ఆలయ ప్రాంగణంలో షారుఖ్ఖాన్ నడిచి వెళ్లున్న వీడియోలు సోషల్మీడియాలో దర్శనమిచ్చాయి.
షారుఖ్ఖాన్ తాజా చిత్రం ‘జవాన్’ సెప్టెంబర్ 7న పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో ఆయన వైష్ణోదేవి ఆలయాన్ని సందర్శించారు. గత ఏడాది కాలంలో షారుఖ్ఖాన్ ఈ ఆలయాన్ని సందర్శించడం ఇది రెండోసారని ఆయన సన్నిహితులు తెలిపారు.