తమిళ ఇండస్ట్రీలో జనరంజకమైన చిత్రాలకు కేరాఫ్ అడ్రస్గా దర్శకుడు అట్లీ పేరును చెబుతారు. ‘జవాన్’ చిత్రంతో దేశవ్యాప్తంగా ఆయన పాపులారిటీ పెరిగిపోయింది. బాలీవుడ్ అగ్ర హీరోలు సైతం అట్లీ డైరెక్షన్లో సినిమా చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తన డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు అట్లీ. దళపతి విజయ్, బాలీవుడ్ బాద్షా షారుఖ్ఖాన్తో భారీ మల్టీస్టారర్ తెరకెక్కించబోతున్నట్లు తెలిపారు.
‘ఈ మధ్యే విజయ్, షారుఖ్ ఓ పార్టీలో కలుసుకున్నారు. అక్కడి నుంచి నాకు ఫోన్ చేశారు. మంచి మల్టీస్టారర్ కథ ఉంటే నటిస్తామని చెప్పారు. వారిద్దరి కోసం కథ సిద్ధం చేయబోతున్నా. నా తదుపరి సినిమా అదే అవుతుంది. ఇద్దరు సూపర్స్టార్స్ సినిమా కాబట్టి 3000కోట్ల వసూళ్లను లక్ష్యంగా పెట్టుకున్నా’ అన్నారు. ప్రస్తుతం ఈ వార్త దక్షిణాదితో పాటు బాలీవుడ్లో హాట్టాపిక్గా మారింది.