కరోనా మహమ్మారి టాలీవుడ్ సినీ పరిశ్రమపై ఎంతగా ఎఫెక్ట్ చూపించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తొలి వేవ్లో దాదాపు 9 నెలలు సినీ పరిశ్రమతో పాటు థియేటర్స్ పూర్తిగా స్తంభించాయి. ఇక సెకండ్ వేవ్లోను థియేటర్స్, షూటింగ్స్కి బ్రేక్ పడింది. అయితే ఇప్పుడిప్పుడే పరిస్థితులు మళ్లీ మాములు స్థితికి వస్తున్నాయి. ఒకదాని తర్వాత ఒకటి అన్నట్టు వరస సినిమాలు థియేటర్స్లో విడుదలై సందడి చేస్తున్నాయి.
జూలై 30న విడుదలైన తిమ్మరసు చిత్రం మంచి విజయం సాధించగా, రీసెంట్గా విడుదలైన ఎస్ఆర్ కల్యాణ మండపం వంటి సినిమాలు మంచి వసూళ్లు సాధించింది. ప్రత్యేక కండీషన్స్ నడుమ ప్రస్తుతం థియేటర్స్ నడుస్తుండగా, వినాయక చవితి నాటికి వంద శాతం ఆక్యుపెన్సీతో థియేటర్స్ కళకళలాడనున్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో పెద్ద సినిమాలు సందడి చేసేందుకు సిద్ధమవుతున్నాయి.
ఇప్పటికే చాలా సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకి సిద్ధంగా ఉన్నాయి. నాని టక్ జగదీష్, నాగ చైతన్య లవ్ స్టోరీ, రానా విరాట పర్వం, సాయి ధరమ్ తేజ్ రిపబ్లిక్, నాగ శౌర్య వరుడు కావలెను, గోపిచంద్ సీటీమార్ వంటి సినిమాలు వినాయక చవితి కానుకగా విడుదల చేయడానికి నిర్మాతలు రెడీ అవుతున్నారు. అక్టోబర్ లో ఆర్ఆర్ఆర్ వంటి భారీ బడ్జెట్ చిత్రం ఉన్న నేపథ్యంలో ఆ లోపే ఈ హీరోలు తమ సినిమాలను విడుదల చేసేందుకు సన్నద్దమవుతున్నట్టు సమాచారం.