ఏ విషయంలోనైనా తన మనసులోని భావాల్ని నిర్మొహమాటంగా వ్యక్తం చేస్తుంటుంది సీనియర్ కథానాయిక శృతిహాసన్. విమర్శలను ధీటైన సమాధానాలతో తిప్పికొడుతుంటుంది. తాజాగా ఈ భామ సోషల్మీడియాలో తనపై వస్తున్న ట్రోల్స్పై స్పందించింది. తన వయసుకంటే రెండింతలు పెద్దవారైన హీరోలతో శృతిహాసన్ నటించడం ఏమాత్రం బాగోలేదని కొందరు నెటిజన్స్ ఆమెను విమర్శిస్తున్నారు. వీటిపై ఓ ఇంటర్వ్యూలో బదులిస్తూ ‘వినోదప్రపంచంలో వయసు అనేది కేవలం ఒక నెంబర్ మాత్రమే. మంచి సినిమాలో అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. ప్రస్తుతం నాకు సినిమాలపరంగా గొప్ప అవకాశాలొస్తున్నాయి.
నా ముందు తరంలోని కథానాయికలు సీనియర్ హీరోల సరసన నటించి వారితో సమానమైన గుర్తింపును సంపాదించుకున్నారు. అందుకే హీరోల వయసు కంటే కథలో నా పాత్ర ప్రాధాన్యత గురించే ఆలోచిస్తా’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ భామ తెలుగులో చిరంజీవి సరసన ‘వాల్తేరు వీరయ్య’, బాలకృష్ణతో కలిసి ‘వీరసింహా రెడ్డి’ చిత్రాల్లో కథానాయికగా నటిస్తున్నది. ఈ రెండు చిత్రాలు సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకురానున్నాయి. వీటితో పాటు ప్రభాస్తో జోడీగా ‘సలార్’ చిత్రంలో నటిస్తున్నది శృతిహాసన్.