Kajol | సీనియర్ కథానాయిక కాజోల్ మరోమారు వివాదంలో చిక్కుకున్నారు. దేశ రాజకీయ నాయకుల్లో చదువురాని వారే ఎక్కువ మంది ఉన్నారంటూ కొద్ది రోజుల క్రితం ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. పలువురు రాజకీయ నేతలు కాజోల్ మాటలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. షారుఖ్ఖాన్ నటించిన ‘పఠాన్’ చిత్ర కలెక్షన్స్ గురించి కాజోల్ సరదాగా చేసిన తాజా వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. కాజోల్ నటించిన కోర్ట్రూమ్ డ్రామా వెబ్ సిరీస్ ‘ది ట్రయల్’ ఇటీవలే డిస్నీ హట్స్టార్ ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో షారుఖ్ఖాన్తో తన అనుబంధం గురించి మాట్లాడింది కాజోల్.
ఆయన తనకు గొప్ప స్నేహితుడని చెప్పింది. ఒకవేళ షారుఖ్ఖాన్ మీకు ఎదురైతే ఆయన్ని మీరు ఏం అడుగుతారని ప్రశ్నించగా…“పఠాన్’ సినిమాకు వచ్చిన నిజమైన కలెక్షన్స్ ఎంతో చెప్పమంటాను’ అంటూ సరదాగా సమాధానమిచ్చింది. అయితే కాజోల్ వ్యాఖ్యలు షారుఖ్ఖాన్ అభిమానులకు ఆగ్రహం తెప్పించాయి. ‘పఠాన్’ చిత్ర విజయాన్ని తక్కువ చేసేలా ఆమె మాట్లాడిందంటూ నెటిజన్లు కామెంట్స్ చేశారు. షారుఖ్ఖాన్-కాజోల్ పలు హిట్ చిత్రాల్లో నటించి సూపర్హిట్ జోడీగా పేరు తెచ్చుకున్నారు. వ్యక్తిగతంగా కూడా వీరిద్దరి మధ్య చక్కటి స్నేహసంబంధాలున్నాయి.