Senior Actress Bhanupriya | ఎనభైయవ దశకంలో టాలీవుడ్లో ఓ వెలుగు వెలిగిన కథానాయిల్లో భాను ప్రియ ఒకరు. నాలుగు దశాబ్ధాల సినీ కెరీర్లో హీరోయిన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా దాదాపు 155 సినిమాల్లో ఎన్నో గొప్ప పాత్రలను పోషించింది. అందం, అభినయం, అద్భుత న్యత్య ప్రతిభతో తెలుగువారి హృదయాల్లో చెరిగిపోని ముద్ర వేసుకుంది. సితార, స్వర్ణకమలం, అన్వేషణ, త్రినేత్రుడు వంటి సినిమాల్లో భాను ప్రియ నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. ముఖ్యంగా స్వర్ణకమలం సినిమాలో తన నటన, నాట్య ప్రతిభకు ముగ్దుడవని తెలుగు సినీ ప్రేక్షకుడు లేడు. ఈ సినిమాతో ఉత్తమ నటిగా నంది అవార్డును కూడా భానుప్రియ గెలుచుకుంది.
హీరోయిన్గా రిటైర్ అయ్యాక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సెకండ్ ఇన్నింగ్స్లోనూ చాలా సినిమాలు చేసింది. అమ్మగా, అక్కగా, పెద్దమ్మగా ఇలా ఏ పాత్ర చేసిన ఆ పాత్రకు జీవం పోసింది. ఛత్రపతి, దమ్ము సినిమాల్లో అమ్మ పాత్ర పోషించి ఆ సినిమాలకు వెన్నుముకగా నిలిచింది. అయితే ఈ మధ్య కాలంలో భానుప్రియ ఎక్కువ సినిమాల్లో కనిపించట్లేదు. 2021లో వచ్చిన నాట్యం తర్వాత తెలుగులో భానుప్రియ మరో సినిమా చేయలేదు. కాగా తాజాగా ఆమె ఓ ఇంటర్వూలో పాల్గొని పలు విషయాలను అభిమానులతో పంచుకుంది.
ఇంటర్వూలో మాట్లాడుతూ తన ఆరోగ్య సమస్య గురించి తెలిపింది. ఆమె క్రమంగా తన జ్ఞాపక శక్తిని కోల్పోతున్నట్లు తెలిపింది. తన భర్త అనారోగ్యంతో కొన్నేళ్ల కిందట మరణించాడని, ఆ తర్వాత తనకు జ్ఞాపక శక్తి తగ్గడం మొదలైనట్లు చెప్పింది. ఈ సమస్య వల్ల సినిమాల్లో డైలాగులు చెప్పలేక ఇబ్బంది పడుతుందట. ఆ మధ్య ఓ తమిళ సినిమా షూటింగ్ చేస్తుంటే డైలాగులు పూర్తిగా మరిచిపోయాయని, మొత్తం బ్లాంక్ అయిపోయిందని తెలిపింది. ప్రస్తుతం తన ఆరోగ్యం అంత బాగాలేదని, డ్యాన్స్ స్కూల్ పెట్టాలన్న ఆలోచనను కూడా అందుకే విరమించుకున్నాని వెల్లడించింది. ప్రస్తుతం మెడిసిన్స్ తీసుకుని కోలుకునే ప్రయత్నం చేస్తున్నానని భాను ప్రియ చెప్పుకొచ్చింది.