అక్షయ్ కుమార్ తాజా సినిమా ‘సమ్రాట్ పృథ్వీరాజ్’ భారీ అపజయాన్ని మూట గట్టుకుంది. ఈ నెల 3న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చారిత్రక నేపథ్య సినిమాను ప్రేక్షకులు తిరస్కరించారు. అత్యున్నత సాంకేతిక విలువలు, ఖర్చు పెట్టినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆకట్టుకోలేకపోయింది. ముంబైలో చాలా చోట్ల జనాలు లేక ప్రదర్శనలు రద్దు చేస్తున్నారు. దాదాపు 200 కోట్ల రూపాయల బడ్జెట్తో రూపొందించిన ఈ సినిమా ఇప్పటిదాకా 55 కోట్ల రూపాయలు మాత్రమే రాబట్టగలిగింది. మిగతాది నిర్మాత నష్టాలుగా భరించాల్సి ఉంటుంది. ఈ చిత్రంలో మానుషీ చిల్లర్ నాయికగా నటించగా, దర్శకుడు చంద్రప్రకాష్ ద్వివేది రూపొందించారు. లాక్డౌన్ టైమ్లోనూ వరుస చిత్రాలతో మెప్పించిన అక్షయ్ కుమార్కు ఇది వరుసగా రెండో అపజయం. దీని ముందు సినిమా ‘బచ్చన్ పాండే’ కూడా ఫ్లాప్ అయ్యింది. ఇటీవల ఇలాంటి భారీ అపజయాలు బాలీవుడ్కు షాక్ ఇస్తున్నాయి. ఇటీవల కంగనా రనౌత్ నటించిన ‘ధాకద్’ సినిమాకు 8వ రోజున మొత్తం 20 టికెట్స్ అమ్ముడయ్యి, 4 వేల రూపాయలు మాత్రమే వసూళ్లు వచ్చాయి. సినిమా బాగా లేకుంటే ప్రేక్షకులు తిరస్కరించే తీరు ఇంత తీవ్రంగా ఉండటం ఫిలింమేకర్స్ను కలవరపరుస్తున్నది.