సత్యం రాజేష్, కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మా ఊరి పొలిమేర-2’. డా॥ అనిల్ విశ్వనాథ్ దర్శకుడు. శ్రీకృష్ణ క్రియేషన్స్ పతాకంపై గౌరీ కృష్ణ నిర్మిస్తున్నారు. నవంబర్ 3న విడుదలకానుంది. దర్శకుడు మాట్లాడుతూ ‘ఈ సినిమా తొలిభాగం చక్కటి ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంది. అదే స్థాయిలో రెండో భాగం మెప్పిస్తుంది.
గ్రామీణ నేపథ్యంలో మర్డర్ మిస్టరీకి చేతబడి అనే అంశాన్ని జోడించి ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ప్రతి సన్నివేశం ఆసక్తిని పంచుతుంది. పాడేరు, కేరళ, ఉత్తరాఖండ్లో చిత్రీకరణ జరిపాం’ అన్నారు. వినూత్నమైన మిస్టరీ థ్రిల్లర్గా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినందిస్తుందని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: ఖుషేందర్ రమేష్ రెడ్డి, సంగీతం: గ్యాని, కథ, స్క్రీన్ప్లే, సంభాషణలు, దర్శకత్వం: డా॥ అనిల్ విశ్వనాథ్.