Chiranjeevi | “ ఈ ఏడాది ‘హను-మాన్’తో తెలుగు సినిమాకు శుభారంభం మొదలైంది. చిన్న సినిమాలు పెద్ద విజయాలు అందుకున్నాయి. రీసెంట్గా దీపావళికి విడుదలైన అమరన్, క, లక్కీభాస్కర్ సినిమాలు కూడా విజయాలు సాధించడం నిజంగా మంచి పరిణామం. కంటెంట్ నమ్ముకొని చేసిన సినిమాలు అవన్నీ. సరిగ్గా తీస్తే చూడ్డానికి జనాలు సిద్ధంగా ఉన్నారు. రేపు ‘జీబ్రా’ కూడా మంచి కంటెంట్తో రాబోతున్నదని తెలుస్తోంది. ఈ బొమ్మ సూపర్హిట్ కావాలి. తమ్ముడు సత్యదేవ్ మంచి నటుడు. ఓటీటీలో తాను చేసిన సినిమాలు చూసి, తనపై నమ్మకంతో నా ‘గాడ్ఫాదర్’లో ఛాన్సిచ్చాను. నా నమ్మకాన్ని నిజం చేస్తూ అద్భుతంగా నటించాడు. ఈ సినిమా కూడా సత్యదేవ్కి మరింత పేరు తీసుకురావాలి. తనని నేను మరింత ఎత్తులో చూడాలి.” అని అగ్రహీరో చిరంజీవి ఆకాంక్షించారు. సత్యదేవ్, డాలీ ధనుంజయ లీడ్రోల్స్ చేసిన యాక్షన్ ఎంటైర్టెనర్ ‘జీబ్రా’. ఈశ్వర్ కార్తీక్ దర్శకుడు. ఎస్.ఎన్.రెడ్డి, ఎస్.పద్మజ, బాలసుందరం, దినేష్ సుందరి నిర్మాతలు.
నవంబర్ 22న సినిమా విడుదల కానుంది. మంగళవారం హైదరాబాద్లో జరిగిన ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్లో చిరంజీవి మాట్లాడారు. ‘వీలునామాతో పనిలేకుండా తరతరాలు మారే ఆస్తి లాంటివారు చిరంజీవి. ఆయన వల్లే ఈ సినిమా నాకొచ్చింది. ‘గాడ్ఫాదర్’లో నా పాత్ర చూశాకే ఈ సినిమాకు హీరోగా నన్ను తీసుకున్నారు. ఆయన ఈ ఈవెంట్కి రావడం మా అందరి అదృష్టం. ఓ విధంగా ఇది నా డెబ్యూ లాంటి సినిమా. ఈ సినిమా తర్వాత ‘ఫుల్ బాటిల్’ అనే సినిమా చేశాను. ఆ సినిమా కూడా కొత్తగా ఉంటుంది. ఇకనుంచి కొత్త సత్యదేవ్ని చూస్తారు.’ అని సత్యదేవ్ అన్నారు. ఇంకా చిత్రబృందంతో పాటు దర్శకుడు ప్రశాంత్వర్మ కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు.