‘ఏదో సంచలనం కోసమని ‘గాడ్సే’ చిత్రాన్ని తీయలేదు. నేటి వ్యవస్థలో ఉన్న సమస్యల్ని కథావస్తువుగా తీసుకున్నాం. వాటికి పరిష్కార మార్గాల్ని కూడా తెలియజెప్పే ప్రయత్నం చేశాం’ అని అన్నారు సత్యదేవ్. ఆయన కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘గాడ్సే’. గోపీ గణేష్ దర్శకుడు. నేడు విడుదల కానుంది. ఈ సందర్భంగా సత్యదేవ్ పాత్రికేయులతో ముచ్చటిస్తూ ‘తొలుత దర్శకుడు ఈ కథ చెప్పినప్పుడు వ్యవస్థపై సంధించే ప్రశ్నల్ని ప్రజలు సరిగ్గా అర్థం చేసుకుంటారో లేదోనని సందేహపడ్డాను. ట్రైలర్కు వస్తున్న స్పందన చూసిన తర్వాత మేం చెప్పాలనుకుంటున్న అంశం ప్రేక్షకులకు చేరువైందనే భావన కలిగింది. నాకున్న సోషల్ అవేర్నెస్ వల్ల ఈ సబ్జెక్ట్తో వెంటనే కనెక్ట్ అయ్యాను.
ఈ సినిమాలో నేను విశ్వనాథ రామచంద్ర అనే పాత్రలో కనిపిస్తా. ఈ సినిమాలో నిజాల్ని ధైర్యంగా చెప్పాం. విద్యావ్యవస్థలో మా ర్పులు రావాలని, యువత తమ ప్రతిభకు, అర్హతకు తగిన ఉద్యోగాల్ని ఎంచుకున్నప్పుడే సమాజం పురోగమిస్తుందనే సందేశాన్నదించాం. థియేటర్ నుంచి బయటకు వచ్చిన ప్రేక్షకులు సినిమాలో చర్చించిన సమస్యల గురించి ఆలోచిస్తారు. అంతలా కథ మనందరిని వెంటాడుతుంది. సినిమాల విషయంలో నేను ఆత్మవిశ్వాసంతో ఉంటాను. ఏదో ఒక శుక్రవారం జాతకం మారిపోతుందని కాకుండా… ప్రతి శుక్రవారాన్ని ఆశావాహదృక్పథంతో స్వీకరిస్తాను’ అని అన్నారు.