‘2010 సంవత్సరంలో జరిగే కథ ఇది. హృదయాన్ని కదలించే భావోద్వేగాలుంటాయి. కన్నడ పద్యం నుంచి ఈ టైటిల్ తీసుకున్నాం’ అన్నారు కన్నడ అగ్ర హీరో రక్షిత్ శెట్టి. కన్నడంలో విజయం సాధించిన ‘సప్త సాగర దాచే ఎల్లో’ చిత్రాన్ని అగ్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ‘సప్త సాగరాలు దాటి’ పేరుతో తెలుగులోకి అనువదించింది. హేమంత్ ఎం రావు దర్శకుడు. నేడు ఈ చిత్రం విడుదలకానుంది. ఈ సందర్భంగా గురువారం రక్షిత్ శెట్టి పాత్రికేయులతో ముచ్చటిస్తూ ‘ప్రేమికులు విడిపోయినా సరే ఏడుసముద్రాల ఆవల కలుసుకుంటారనే ఓ కవితాత్మక భావనతో ఈ టైటిల్ పెట్టాం.
‘ఛార్లీ’ తర్వాత సినిమాల పరంగా నా సన్నాహాలు వేరుగా ఉన్నాయి. ఈలోపు ఓ చక్కటి ప్రేమకథలో నటించాలనుకున్నా. దర్శకుడు ఈ కథపై గత పన్నెండేండ్లుగా వర్క్ చేస్తున్నాడు. ఇదొక అద్భుత దృశ్యకావ్యం. కన్నడంలో విడుదలై క్లాసిక్ మూవీగా పేరు తెచ్చుకుంది. తెలుగులో కూడా అదే స్థాయి ఆదరణ దక్కుతుందనుకుంటున్నా. అందమైన ఫొటోగ్రఫీతో సినిమాలోని ప్రతీ సన్నివేశం హైలైట్గా అనిపిస్తుంది. నా తదుపరి చిత్రం ‘రిచర్డ్ ఆంథోనీ’ ఓ గ్యాంగ్స్టర్ కథ. తెలుగులో స్ట్రెయిట్ సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఆ లోపు తెలుగు భాష, సాహిత్యంపై పట్టు సంపాదించాలనుకుంటున్నా’ అన్నారు.