‘తారల వారసులు ఎంతో మంది పరిశ్రమలోకి వచ్చారు. కానీ ఎలాంటి నేపథ్యం లేకుండా స్వీయ ప్రతిభతో సప్తగిరి హీరోగా రాణిస్తున్నారు. హీరోగా నాలుగో సినిమా చేస్తున్న సప్తగిరికి ప్రేక్షకుల ఆశీస్సులు దక్కాలని కోరుకుంటున్నా’ అన్నారు రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఎస్ఆర్ఆర్ ప్రొడక్షన్స్ సంస్థలో సప్తగిరి, నేహా సోలంకి జంటగా కె.యమ్.కుమార్ దర్శకత్వంలో శ్రీనివాస్రెడ్డి, కటారి రమేష్ నిర్మించిన చిత్రం ‘గూడుపుఠాణి’. గురువారం ప్రీరిలీజ్ వేడుక జరిగింది. సప్తగిరి మాట్లాడుతూ ‘ఇప్పటివరకు నేను థ్రిల్లర్ సినిమా చేయలేదు. ట్రైలర్ చూసినవారందరూ అద్భుతంగా ఉందని మెచ్చుకుంటున్నారు. ఈ సినిమాలో రఘు కుంచె ప్రతినాయకుడిగా నటించారు. ఓ విభిన్నమైన కాన్సెప్ట్తో సినిమా చేసినందుకు సంతోషంగా ఉంది’ అన్నారు. కథకు తగిన అన్ని హంగులు కుదరడం వల్ల సినిమా అనుకున్న రీతిలో వచ్చిందని, సెన్సార్వారు సినిమా చూసి మెచ్చుకోవడం నమ్మకాన్ని పెంచిందని దర్శకుడు కుమార్ ఎం.కె ఆనందం వ్యక్తం చేశారు. నిర్మాతలు మాట్లాడుతూ ‘హంపి, మైసూర్, మేల్కొటి, కంచి, చిక్మగళూరు వంటి అందమైన లొకేషన్లలో చిత్రీకరణ జరిపాం. సప్తగిరి ఇదివరకెప్పుడూ చూడని కొత్త పాత్రలో కనిపిస్తారు’ అని చెప్పారు. ఈ వేడుకలో ఆందోల్ శాసనసభ్యుడు క్రాంతికుమార్, దర్శకుడు మారుతి పాల్గొన్నారు.