సినిమా : సప్తసాగరాలు దాటి
తారాగణం: రక్షిత్శెట్టి, రుక్మిణి వసంత్, పవిత్రలోకేశ్..
దర్శకత్వం: హేమంత్ ఎం.రావు.
నిర్మాణం: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
రక్షిత్ శెట్టి, రుక్మిణి వసంత్ జంటగా హేమంత్ ఎం.రావు దర్శకత్వంలో రూపొందిన కన్నడ సినిమా ‘సప్తసాగర దాచే ఎల్లో’. కన్నడంలో భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమా తెలుగునాట కూడా కొన్ని థియేటర్లలో విడుదలైంది. హైదరాబాద్లో ప్రథమంగా రెండే రెండు షోలతో ఈ సినిమా విడుదలైంది. ప్రేక్షకాదరణ బావుండటంతో షోలను పదుల సంఖ్యలో పెంచారు. దాంతో ప్రముఖ చలనచిత్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీవారు ఈ సినిమాను ‘సప్తసాగరాలు దాటి’ పేరుతో తెలుగులోకి అనువదించి ఈ శుక్రవారం విడుదల చేశారు. ప్రచారంలో భాగంగా ఇటీవల విడుదల చేసిన తెలుగువెర్షన్ ట్రైలర్కు ప్రేక్షకుల్లో మంచి స్పందన ఏర్పడింది. మరి కన్నడ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న ఈ సినిమా తెలుగువారికి కూడా నచ్చేలావుందా? లేదా? తెలుసుకోవాలంటే.. ముందు కథలోకెళ్దాం.
కథ:
మను, ప్రియ.. వీరిది ఒకర్ని విడిచి ఒకరు ఉండలేదనంత ప్రేమ. ఒకరంటే ఒకరికి పిచ్చి. వీరి ప్రేమకు అంతస్థుల అడ్డంకులు లేవు. పెద్దవాళ్ల పట్టింపులూ లేవు. ఎటువంటి అవరోధాలూ లేవు. కలిసి బతకాలనుకుంటారు. కలలు కంటారు. భావి జీవితం బాగుండటం కోసం వారిద్దరూ తీసుకునే ఓ తప్పుడు నిర్ణయం వారి జీవితాన్నే మార్చేస్తుంది. ఏంటా నిర్ణయం? వారి జీవితం ఎలాంటి మలుపు తీసుకుంది? అనేది మిగతా కథ.
కథా విశ్లేషణ:
అవాంతరాలే లేని ఓ ప్రేమకు ఏర్పడ్డ భయంకరమైన అగాధమే ఈ ప్రేమకథ. చూస్తున్నంత సేపూ ఓ జీవితాన్నే చూస్తున్న అనుభూతి. అనాలోచితంగా తీసుకునే కొన్ని నిర్ణయాలు జీవితాలను తారుమారు చేసేస్తాయనడానికి ఈ కథ ఓ ఉదాహరణ.
నటీనటుల పర్ఫార్మెన్సెస్:
హీరోయిన్ కేరక్టరైజేషన్ ఈ సినిమా ప్రధానబలం. రుక్మిణి అద్భుతంగా నటించింది. కళ్లతోనే సునిశితమైన భావాలను సైతం పలికించిందామె. ముఖ్యంగా ద్వితీయార్థంలో ఆమె నటన సూపర్. పెద్దగా మేకప్ లేకపోవడం వల్ల అందంగా కనిపించారామె. రక్షిత్ శెట్టి కూడా చక్కగా నటించాడు. ఈ సినిమాకోసం చాలా కష్టపడ్డాడు కూడా. పవిత్రాలోకేశ్ పాత్ర కూడా బావుంది.
టెక్నికల్:
దర్శకుడు హేమంత్ నిజానికి దగ్గరగా ఈ కథ రాసుకున్నాడు. అసలు జరిగిన కథనే సినిమాగా తీశాడా అనే అనుమానం వస్తుంది. ద్వితీయార్థంలో అయితే భావోద్వేగాలతో చెడుగుడాడేశాడు. ఏ తప్పూ చేయకుండా, మనస్పర్థలే లేకుండా గుండెనిండా ప్రేమను నింపుకొనివున్న ఓ జంట, అన్యాయంగా విడిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో తను తెరపై చూపించిన తీరు అద్భుతం. అయితే ప్రథమార్థం మాత్రం ల్యాగ్ అనిపిస్తుంది. అసలు కథలోకి వెళ్లటానికి టైమెక్కువ తీసుకోవడమే ఈ ల్యాగ్కి కారణం. దాంతో ప్రేక్షకుడు కాస్త అసహనానికి లోనవుతాడు. ద్వితీయార్థం మాత్రం మనసులకు హత్తుకుపోయేలా, కవితాత్మకంగా ఈ కథను మలిచాడు దర్శకుడు హేమంత్. ఇక అద్వైత గురుమూర్తి సినిమాటోగ్రఫీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ప్రతి ఫ్రేమూ పొయిటిగ్గా చిత్రీకరించారాయన. ముఖ్యంగా హీరోయిన్ని చాలా అందంగా చూపించాడు. తెరపై ఆయన వాడిన టింట్ బావుంది. కొన్ని షాట్స్ ప్రత్యేకంగా చెప్పుకునేలా వున్నాయ్. చరణ్రాజ్ నేపథ్య సంగీతం బావుంది. పాటలైతే వినసొంపుగా లేవు. ఎడిటర్కైతే ఇంకాస్త పనుంది. ఇది తొలిభాగం మాత్రమే. పాత్రల్ని సంఘర్షణలలో బంధించి, బాధపెట్టి ఈ తొలిభాగాన్ని ఓ విధంగా, అసంపూర్తిగానే ముగించాడు దర్శకుడు. ఈ సినిమా రెండో భాగం అక్టోబర్ 22న రిలీజ్ కానుంది. మరి దర్శకుడు ఈ కథకు ముగింపు ఎలా పలికాడో చూడాలి. మొత్తంగా సినిమా బావుంది. మంచి సినిమా. చూడాల్సిన సినిమా.
రేటింగ్ : 3/5