Sridevi Shoban Babu | సాధారణంగా హీరోల వారసులు కచ్చితంగా హీరోలే అవుతుంటారు. కానీ కూతుళ్లు మాత్రం హీరోయిన్ అవ్వాలని రూల్ లేదు. మరీ ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీలో ప్రముఖ హీరోల కూతుళ్లందరూ నటనకు దూరంగానే ఉన్నారు. కొందరు నిర్మాతలుగా.. మరికొందరు కాస్ట్యూమ్ డిజైనర్లుగా బిజీ అయిపోయారు. అందులో చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత కొణిదెల కూడా ఉంది. ఇప్పటికే తండ్రి హీరోగా నటిస్తున్న ప్రతి సినిమాకు ఈమె కాస్ట్యూమ్ డిజైనర్ గా వర్క్ చేస్తున్నారు. దాంతోపాటు గోల్డెన్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ అంటూ ఒక నిర్మాణ సంస్థ మొదలుపెట్టి అందులో తన భర్త విష్ణు ప్రసాద్ తో కలిసి చిన్న సినిమాలు నిర్మిస్తున్నారు సుష్మిత. ఇప్పటికే ఈ గోల్డెన్ బాక్స్ నుంచి షూట్ అవుట్ ఆలేరు అనే వెబ్ సిరీస్ వచ్చింది.
తాజాగా సంతోష్ శోభన్ హీరోగా శ్రీదేవి శోభన్ బాబు అనే సినిమా నిర్మించింది. ప్రశాంత్ కుమార్ దిమ్మల అనే కొత్త దర్శకుడు చెప్పిన కథ నమ్మి ఈ సినిమా నిర్మించింది మెగా డాటర్. తన ప్రొడక్షన్ హౌస్ నుంచి వస్తున్న మొదటి సినిమా కావడంతో శ్రీదేవి శోభన్ బాబుపై చాలా ఆశలు పెట్టుకుంది సుస్మిత. దానికి తోడు తండ్రి చిరంజీవి ఆశీస్సులు తనపై ఎప్పటికీ ఉంటాయని.. ఈ సినిమా కథ ఆయనకు బాగా నచ్చింది అని ప్రమోషన్స్ లో తెలిపింది సుష్మిత. పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో దొరికిన ఈ సినిమా శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 18 విడుదల కానుంది. మరోవైపు హీరో సంతోష్ శోభన్ కెరీర్ కు కూడా శ్రీదేవి శోభన్ బాబు సినిమా కీలకంగా మారింది.
ఎందుకంటే సంక్రాంతికి విడుదలైన కళ్యాణం కమనీయం సినిమా ఎప్పుడు వచ్చి వెళ్లిపోయిందో కూడా ప్రేక్షకులకు గుర్తులేదు. కెరీర్ లో ఇప్పటివరకు సరైన బ్లాక్ బస్టర్ కోసం వేచి చూస్తూనే ఉన్నాడు ఈ హీరో. ఓటీటీలో రెండేళ్ల కింద విడుదలైన ఏక్ మినీ కథ మినహాయిస్తే.. హీరోగా సంతోష్ శోభన్ కు గుర్తింపు తీసుకొచ్చిన సినిమా మరోటి లేదు. ఆ తర్వాత మంచి హైప్ తో విడుదలైన నేర్లపాక గాంధీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సినిమా డిజాస్టర్ అయింది. అలాగే సంక్రాంతికి వచ్చిన యువీ క్రియేషన్స్ వారి కళ్యాణం కమనీయం అంచనాలు అందుకోలేదు. ఇలాంటి సమయంలో చిరంజీవి కూతురు నిర్మించిన మొదటి సినిమాలో హీరోగా నటించాడు సంతోష్ శోభన్. ఈ సినిమా ఆయనకు మాత్రమే కాకుండా సుస్మితకు కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా మారింది. మరి మెగా డాటర్ పెట్టుకున్న నమ్మకాన్ని ఈ కుర్ర హీరో ఎంత వరకు నిలబెడతాడో చూడాలి.