తమిళ అగ్ర కథానాయకుడు ధనుష్ హీరోగా బాలీవుడ్లో ఓ మైథాలాజికల్ జంగిల్ డ్రామా తెరకెక్కనున్నది. కోలీవుడ్ ఫిల్మ్ మేకర్ పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రానికి బాలీవుడ్ అగ్ర దర్శకుడు సంజయ్లీలా భన్సాలీ నిర్మాత. ఈ ప్రాజెక్ట్కు హీరోగా ముందు రామ్చరణ్ను అనుకున్నారట. కొన్ని కారణాల వల్ల చర్చలు కార్యరూపం దాల్చకపోవడంతో ఈ సినిమా ధనుష్ కాంపౌండ్కు చేరిందంటూ బాలీవుడ్ మీడియాలో వార్తలొచ్చాయి.
ఓ పౌరాణిక గాథ ఆధారంగా అటవీ నేపథ్యంలో ఈ కథ సాగుతుందట. దర్శకుడు పీఎస్ మిత్రన్ తమిళంలో తెరకెక్కించిన ఇరుంబు తిరై, సర్దార్ చిత్రాలు మంచి విజయాలను అందుకున్నాయి. దీంతో పాటు భన్సాలీతో ఆయనకు ఉన్న అనుబంధం కారణంగా ఈ ప్రాజెక్ట్ మిత్రన్కి దక్కిందని ఇన్సైడ్ టాక్. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానున్నది.