Aakhri Sawal Teaser | బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సరికొత్త చిత్రం ‘ఆఖ్రీ సవాల్’. ఈ చిత్రం మే 08న ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా.. తాజాగా టీజర్ను విడుదల చేసింది చిత్రయూనిట్. జాతీయ అవార్డు గ్రహీత అభిజీత్ మోహన్ వారంగ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా అత్యంత సున్నితమైన అంశాలను తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) శతాబ్ది ప్రయాణాన్ని నేపథ్యంగా తీసుకుని ఈ సినిమా కథను రాసుకున్నట్లు సమాచారం. సంజయ్ దత్ ఈ చిత్రంలో ప్రొఫెసర్ గోపాల్ నాదకర్ణి అనే కీలకమైన పాత్రలో నటిస్తుండగా, ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తి కుమారుడు నమాశి చక్రవర్తి ఆయన వద్ద పీహెచ్డీ చేసే విక్కీ అనే విద్యార్థి పాత్రలో కనిపించబోతున్నాడు.
టీజర్ చూస్తుంటే.. ఈ చిత్రంలో ఆర్ఎస్ఎస్పై గతంలో వచ్చిన ఆరోపణలు ఏమిటి, గాంధీ హత్యనంతారం 1948లో ఆ సంస్థపై విధించిన నిషేధం వెనుక ఉన్న పరిస్థితులు ఏంటి, అలాగే 1992లో జరిగిన బాబ్రీ మసీదు కూల్చివేత వంటి ఎన్నో సున్నితమైన అంశాలను ప్రస్తావిస్తూ సినిమా కథ ముందుకు సాగనున్నట్లు టీజర్ ద్వారా అర్థమవుతోంది. ఈ చిత్రంలో సంజయ్ దత్, నమాశి చక్రవర్తిలతో పాటు అమిత్ సాధ్, సమీరా రెడ్డి, నీతూ చంద్ర, త్రిధా చౌదరి వంటి నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఉత్కర్ష్ నైతాని కథను అందించగా, మోంటీ శర్మ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. అలాగే ప్రసిద్ధ కవి కుమార్ విశ్వాస్ ఈ చిత్రానికి సాహిత్యాన్ని అందించడం విశేషం. ఈ భారీ చిత్రాన్ని ప్రముఖ వ్యాపారవేత్త నిఖిల్ నందా మరియు సంజయ్ దత్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.