‘వంగవీటి’ ‘జార్జిరెడ్డి’ చిత్రాలతో ప్రతిభావంతుడైన నటుడిగా పేరు తెచ్చుకున్నారు సందీప్మాధవ్. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘గంధర్వ’. అప్సర్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. జూలై 1న విడుదలకానుంది. ఈ సందర్భంగా ఆదివారం సందీప్మాధవ్ పాత్రికేయులతో ముచ్చటిస్తూ ‘ఈ సినిమాలో నేను సైన్యంలో పనిచేసే వ్యక్తిగా కనిపిస్తా. పెళ్లయిన మరుసటి రోజే యుద్ధానికి వెళ్లాల్సి వస్తే అతని మానసిక స్థితి ఎలా ఉంటుంది? ఆ తరుణంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? అన్నది ఆసక్తికరంగా ఉంటుంది. 1971 నుంచి 2021 మధ్య నడిచే ఫాంటసీ థ్రిల్లర్ ఇది. పురాణాల్లోని కింపురుషులు, గంధర్వులకు చావు ఉండదు. నిత్య యవ్వనులుగా కనిపిస్తారు. ఈ సినిమాలో నేను పోషించిన పాత్ర కూడా యాభైఏళ్లొచ్చిన యవ్వనంగానే కనిపిస్తుంది. అలా ఎందుకు జరిగిందన్నదే సినిమాలో ఇంట్రెస్టింగ్ పాయింట్. ఈ నేపథ్య కథలో కుటుంబ అనుబంధాలకు పెద్ద పీట వేశాం.
ఈ సినిమాలో మిలిట్రీ అనేది హీరో నేపథ్యంగా మాత్రమే ఉంటుంది. కథ మొత్తం ఫాంటసీ కేంద్రంగా నడుస్తుంది’ అన్నారు. ఇప్పటివరకు తాను బయోపిక్ సినిమాలు చేశానని, తన కెరీర్లో తొలిసారి నటించిన రొమాంటిక్ చిత్రమిదని సందీప్మాధవ్ పేర్కొన్నారు. ‘బయోపిక్ చిత్రాల హీరో అనే ముద్ర నుంచి బయటకు రావాలనుకుంటున్నా. అందుకే ఈ మధ్య కొంచెం గ్యాప్ తీసుకున్నా. ప్రస్తుతం విభిన్న కథాంశాలపై దృష్టిపెడుతున్నా. ‘గంధర్వ’ సినిమాను ఎస్.కె.ఫిల్మ్స్ ద్వారా సురేష్ కొండేటి విడుదల చేయడం ఆనందంగా ఉంది. ప్రస్తుతం ‘మాస్ మహరాజ్’ అనే సినిమా చేస్తున్నా. ఇందులో యాభైఏళ్ల వ్యక్తిగా కనిపిస్తా. ఓటీటీలో మంచి అవకాశాల కోసం ఎదురుచూస్తున్నా’ అని సందీప్మాధవ్ తెలిపారు.