సందీప్ కిషన్ హీరోగా నటించిన సినిమా ‘మైఖేల్’. విజయ్ సేతుపతి, వరుణ్ సందేశ్ కీలక పాత్రలు పోషించారు. దివ్యాంశ కౌశిక్, వరలక్ష్మి శరత్కుమార్ నాయికలుగా నటించారు. యాక్షన్ ఎంటర్టైనర్గా దర్శకుడు రంజిత్ జయకోడి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, కరణ్ సి ప్రొడక్షన్స్ ఎల్ఎల్పీ సంయుక్తంగా నిర్మించాయి. పూస్కూర్ రామ్మోహన్రావు, భరత్ చౌదరి నిర్మాతలు. నారాయణదాస్ కె నారంగ్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు.
రేపు ఈ సినిమా విడుదల కానుంది. తాజాగా చిత్ర ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని హీరో నాని ముఖ్య అతిథిగా హైదరాబాద్లో నిర్వహించారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ…‘ఈ సినిమా కంటెంట్ చూస్తే తెరపై ఒక కొత్త ఒరవడిని సృష్టిస్తుందని అనిపిస్తున్నది. అప్పట్లో ‘శివ’లా చాలా ఏండ్లకు ఒక సినిమా ఇలాంటి అనుభూతిని పంచుతుంది. ఇదీ అలాంటి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నా. కష్టం, ప్రతిభ, అదృష్టం ఈ మూడు ఉంటే నటులు ఉన్నత స్థాయికి వెళ్తారు.
ఒక అదృష్టం మినహా సందీప్ కిషన్లో మిగతావన్నీ ఉన్నాయి. ఈ చిత్రంతో అదృష్టం కూడా తోడవ్వాలని ఆశిస్తున్నా. దర్శకుడు రంజిత్ సినిమాను కొత్తగా రూపొందించాడు’ అన్నారు. సందీప్ కిషన్ మాట్లాడుతూ…‘కెరీర్ ప్రారంభం నుంచీ నాని నేనూ మంచి స్నేహితులం. నాకు ఎప్పుడూ స్ఫూర్తినిస్తుంటారు. ఆయన నా కార్యక్రమానికి రావడం ఇదే తొలిసారి. నటుడిగా నా పూర్తి ప్రయత్నం ఈ చిత్రంలో చేశాను. నేను ఏది చేయలేనని అనుకున్నానో అది చేయగలనని చూపించారు దర్శకుడు రంజిత్. మా సినిమా ట్రైలర్కు మంచి స్పందన వచ్చింది. ఇదే రెస్పాన్స్ థియేటర్స్లోనూ అందిస్తారని ఆశిస్తున్నా’ అన్నారు.
నిర్మాత పూస్కూర్ రామ్మోహన్ రావు మాట్లాడుతూ…‘దర్శకుడు రంజిత్ కథ చెప్పినప్పుడే బాగా నచ్చింది. ఆ కథను అంతే బాగా తెరకెక్కించి మెప్పించాడు. సినిమా చూసి సర్ప్రైజ్ అయ్యాం. సందీప్ కెరీర్లో ఇదే బిగ్గెస్ట్ రిలీజ్. దేశవ్యాప్తంగా 1500 థియేటర్స్లో తెరపైకి తెస్తున్నాం. హిందీలోనే 500 స్క్రీన్స్లో విడుదల చేస్తున్నాం’ అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు భరత్ చౌదరి, అభిషేక్ అగర్వాల్, నాయిక దివ్యాంశ కౌశిక్, నటుడు వరుణ్ సందేష్ తదితరులు పాల్గొన్నారు.