నితిన్ హీరోగా నటించిన ‘మాచర్ల నియోజకవర్గం’ చిత్రంలో ప్రతి నాయకుడిగా నటించారు సముద్రఖని. ఈ చిత్రాన్ని శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై నికితా రెడ్డి నిర్మాణంలో దర్శకుడు ఎంఎస్ రాజశేఖర రెడ్డి రూపొందించారు. రేపు ఈ సినిమా విడుదలవుతున్న సందర్భంగా చిత్రంలో నటించిన అనుభవాలు తెలిపారు సముద్రఖని. ఆయన మాట్లాడుతూ…‘ఈ కథ వినగానే నాకు తమిళనాడులోని ఓ ప్రాంతంలో జరిగిన ఘటన గుర్తొచ్చింది. అక్కడ పాతికేళ్లుగా ఎన్నికలు నిర్వహించకుండానే పదవులు పొందుతున్నారు. ఈ చిత్రంలో రాజప్ప అనే పాత్రలో నటించాను. రాజప్ప లాంటి వాళ్లను నిజ జీవితంలోనూ చూశాను. ఆద్యంతం ఒక ఎమోషన్తో సాగే పాత్ర ఇది. నా క్యారెక్టర్లో ఒక సర్ ప్రైజ్ కూడా ఉంది. అది సినిమాలో చూడాలి. కామెడీ, యాక్షన్, లవ్ అన్నీ ఉన్న చిత్రమిది. కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేస్తారు. నితిన్తో కలిసి నటించడం ఆనందంగా ఉంది. నా దర్శకత్వంలో అతనితో సినిమా చేస్తా. ‘అల వైకుంఠపురములో’ చిత్రం నుంచి టాలీవుడ్లో నా ప్రయాణం బాగా సాగుతున్నది. తెలుగు ప్రేక్షకులు నన్ను ఆదరిస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవి గారితో ‘గాఢ్ ఫాదర్’, నానితో ‘దసరా’ చిత్రాల్లో నటిస్తున్నాను.’ అన్నారు.