‘ఇందులో నా పాత్ర పేరు ఉత్తర. ఇప్పటివరకూ ఈ తరహా పాత్ర నేను చేయలేదు. మంగపతిగా జనాల హృదయాల్లో ఓ పవర్ఫుల్ వ్యక్తిగా నిలిచిపోయిన శివాజీనే డామినేట్ చేసే పాత్ర నాది. శివాజీ కూడా ఈ పాత్ర పోషణ విషయంలో నన్నెంతో ఎంకరైజ్ చేశారు’ అని తెలిపారు సీనియర్ నటి లయ. శివాజీకి జోడీగా ఆమె నటించిన క్రైమ్ కామెడీ ఫ్యామిలీ థ్రిల్లర్ ‘సాంప్రదాయని సుప్పిని సుద్దపూసని’. సుధీర్ శ్రీరామ్ దర్శకుడు. శివాజీ స్వయంగా నిర్మించిన ఈ చిత్రాన్ని ఈటీవీ విన్తో కలిసి బన్నీవాస్, వంశీ నందిపాటి సమర్పిస్తున్నారు. ఈ నెల 6న సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్లో లయ విలేకరులతో ముచ్చటించారు.
‘శివాజీతో కలిసి నటించి 20ఏళ్లు అవుతున్నది. తనతో సినిమా అనగానే ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనుకున్నాను. కానీ ఇది అన్ని వయసులవారికీ నచ్చే అవుట్ అండ్ అవుట్ కామెడీ క్రైమ్ జోనర్. ఇందులో డార్క్ కామెడీతోపాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి’ అని పేర్కొన్నారు లయ. సినిమాను అన్ని రకాలుగా ప్రేమించే పాషన్ ఉన్న నటుడు శివాజీ అని, అప్పటికంటే ఇప్పుడు తనకు సినిమాపై ప్రేమ మరింత పెరిగిందని, పూర్తి క్లారిటీతో సినిమాను దర్శకుడు సుధీర్ శ్రీరామ్ తెరకెక్కించారని, నటిగా తనలోని కొత్త కోణాన్ని ఈ సినిమాలో చూస్తారని లయ చెప్పారు.