కిరణ్ అబ్బవరం, చాందినీ చౌదరి హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా ‘సమ్మతమే’. ఈ చిత్రాన్ని యూజీ ప్రొడక్షన్స్ పతాకంపై కంకణాల ప్రవీణ నిర్మించారు. గోపీనాథ్ రెడ్డి దర్శకత్వం వహించారు. విభిన్న ప్రేమ కథా చిత్రంగా తెరకెక్కి ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిందీ సినిమా. తాజాగా హైదరాబాద్లో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాత కంకణాల ప్రవీణ మాట్లాడుతూ..‘మేము ఆశించిన దాని కంటే పెద్ద విజయాన్ని ప్రేక్షకులు అందించారు. మా సినిమా అని వాళ్లు భావించారని అనిపిస్తున్నది. ఈ విజయం మా చిత్ర బృందానికి అంకితం’ అన్నారు. ‘మన చుట్టూ జరిగే కథ, మనం చూసే సన్నివేశాలు, మనకు తెలిసిన పాత్రలు ఉంటాయని మేము చెబుతూ వచ్చాం. ఇవాళ సినిమా చూసిన వాళ్లూ అదే అనుభూతికి లోనవుతున్నారు. నా పాత్ర చాలా మంది అమ్మాయిల వ్యక్తిత్వాన్ని చూపించింది అని చెప్పడం సంతోషంగా ఉంది’ అని చెప్పింది నాయిక చాందినీ చౌదరి. హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ…‘నేటి యువత జీవితాలను స్ఫూర్తిగా తీసుకుని ఈ చిత్రాన్ని రూపొందించాం. మేము చెప్పినట్లే ఇది మా కథ అని ప్రేక్షకులు ఫీల్ అవుతున్నారు. థియేటర్స్లో రెస్పాన్స్ బాగుంది. ఇకపైనా మీ అందరికి నచ్చే సినిమాలే చేస్తానని చెబుతున్నాను’ అన్నారు. ఈ కార్యక్రమంలో ఇతర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.