అమరావతి : ఏ సినిమాకైనా, ఎవరి సినిమాకైనా ఒకటే రేటు, దీని కోసం కార్యాచరణ చేసుకోవాలని సినీ ప్రముఖులకు ఏపీ సీఎం జగన్ సూచించారు. ఈరోజు తాడేపల్లిలో చిరంజీవి బృందంతో జరిగిన చర్చల్లో జగన్ మాట్లాడారు. టికెట్ల రేట్ల విషయంలో మంచి నిర్ణయం తీసుకుంటున్నామని నిర్మాతలకు నష్టం లేకుండా ప్రేక్షకులకు భారం కాకుండా టికెట్ ధరలు ఉంటాయని వెల్లడించారు.
‘ ఇప్పటివరకు కొద్దిమందికి ఎక్కువ, కొద్దిమందికి తక్కువ టికెట్ రేట్లు వసూలు చేస్తున్నారు. చిరంజీవి అన్న, నేను దీనిపై విస్తృతంగా చర్చించామ’ ని జగన్ వివరించారు. విశాఖలో సినిమా షూటింగ్లకు అనువైన స్థలాలు ఉన్నాయని, టాలీవుడ్ను విశాఖకు విస్తరించాలని సూచించారు. విశాఖలో స్టూడియోల నిర్మాణలకు ముందుకు వచ్చే వారికి స్థలాలు ఇస్తామని , సినీ ఇండస్ట్రీపై ఆధారపడ్డ వారందరికీ స్థలాలు ఇస్తామని ప్రకటించారు. విశాఖలో జూబ్లీహిల్స్ తరహ ప్రాంతాన్ని క్రియేట్ చేద్దామని భేటీలో వెల్లడించారు.
హైదరాబాద్ బెంగళూరు, చెన్నైతో పోటీపడే సత్తా విశాఖకు ఉందదన్నారు. భారీ బడ్జెట్ సినిమాలకు ప్రోత్సహకాలు అందించే ఆలోచన చేస్తామన్నారు.