Samay Raina | పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. దీంతో పరిస్థితులు తీవ్రస్థాయికి చేరాయి. భారత్లోని సరిహద్దు ప్రాంతాల్లో సైనిక స్థావరాలపై పాక్ దాడులు చేసేందుకు ప్రయత్నించింది. సరిహద్దు రాష్ట్రాల్లోని ఉధంపూర్, సాంబా, జమ్ము, అఖ్నూర్, నగ్రోటా, పఠాన్కోట్ ప్రాంతాల్లో పాకిస్తాన్ డ్రోన్లతో దాడులకు పాల్పడగా, వాటిని భారత భద్రత బలగాలు గాల్లోనే కూల్చివేశారు. జమ్మూ కాశ్మీర్, సహా రాజస్థాన్లోని రామ్గర్, జైసల్మేర్లోని బీఎస్ఎఫ్ క్యాంపులపై కూడా డ్రోన్లతో దాడి చేసేందుకు పాకిస్తాన్ ప్రయత్నించింది. వాటన్నింటిని భారత భద్రతా బలగాలు సమర్థవంతంగా కూల్చివేసినట్టు తెలుస్తోంది.
బోర్డర్లో పరిస్థితి దారుణంగా ఉంది. అక్కడ పని చేస్తున్న సైన్యం కుటుంబ సభ్యులు అయితే నిద్ర కూడా పోవడం లేదు. అయితే జమ్మూలో విధులు నిర్వహిస్తున్న తన తండ్రి కోసం సమయ్ రైనా అనే కమెడీయన్ ఎంతో ఎమోషనల్ అవుతున్నారు. ఆర్మీలో ఉన్నవారి కుటుంబ సభ్యులు ఎవరు కూడా ప్రశాంతంగా నిద్రపోలేరని కామెంట్ చేశారు. నా తండ్రి ఫోన్ కోసం చాలా ఆందోళన చెందుతున్నాను. ఆయన ఫోన్ కోసం ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటాను. ఇప్పుడు నాన్న జమ్మూలో విధులు నిర్వహిస్తున్నారు. గురువారం రాత్రి గుడ్ నైట్ చెప్పడానికి నాకు కాల్ చేశారు.
అక్కడ పరిస్థితి అదుపులోనే ఉందని చెప్పారు. టెన్షన్ పడకుండా పడుకోమని అన్నారు. కాని ఆయన నుండి ఫోన్ వచ్చే వరకు మనిషిని మనిషిలా లేను . చాలా టెన్షన్ పడ్డాను. ఆయన మాట్లాడాక కొంత ప్రశాంతంగా అనిపించింది. ఇక ఇంట్లో లైట్స్ ఆఫ్ చేసి కర్టెన్ క్లోజ్ చేశాను. కాని నా పొరుగింట్లో లైట్స్ వెలుగుతూనే ఉన్నాయి. బహుశా వారి ఇంట్లోని వ్యక్తి కూడా ఆర్మీలో ఉన్నారేమో అని అనుకున్నాను. అందుకే వారికి నిద్రపట్టడం లేదు అనుకుంటా. మన భద్రత కోసం త్యాగాలు చేస్తున్న సైనికులు, వారి కుటుంబాలకి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జైహింద్ అని రాసుకొచ్చారు సమయ్ రైనా.