Samantha | ఆరోగ్య సమస్యల కారణంగా ఆగ్ర కథానాయిక సమంత ఏడాది పాటు నటనకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుందని గత కొద్ది రోజులుగా వార్తలొస్తున్నాయి. సమంత ఇన్స్టాగ్రామ్ తాజా పోస్ట్ ఆ వార్తలను ధృవీకరించేలా ఉంది. గురువారంతో ‘సిటాడెల్’ వెబ్సిరీస్ను పూర్తి చేసింది సమంత. ఈ సందర్భంగా చిత్ర బృందానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్ట్ పెట్టింది. “సిటాడెల్’ షూటింగ్ పూర్తయింది. రాబోవు రోజుల్లో ఏం చేయాలో ముందే తెలుసు కాబట్టి బ్రేక్ తీసుకోవడం పెద్ద తప్పుగా అనిపించడం లేదు.
మీరంతా నన్ను ఓ ఫ్యామిలీ మెంబర్లా భావించి ఆప్యాయత కనబరిచారు. నేను చేసిన ప్రతీ యుద్ధంలో వెన్నంటి ఉంటూ ధైర్యాన్నిచ్చారు. మీ అందరిని గర్వపడేలా చేయాలన్నదే నా కోరిక’ అని సమంత తన పోస్ట్లో పేర్కొంది. మయోసైటిస్ చికిత్స కోసం సమంత అమెరికా వెళ్లనుందని, అందుకే ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ తీసుకోనుందని ప్రచారం జరుగుతున్నది. తాజా పోస్ట్ ద్వారా ఆమె పరోక్షంగా ఈ విషయాన్ని వెల్లడించిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.