బాలీవుడ్ బాద్షాగా పిలిచే షారుఖ్ ఖాన్తో కలిసి నటించాలని ప్రతి నాయికా కోరుకుంటుంది. అందులో దక్షిణాది హీరోయిన్లకు ఇది అరుదైన అవకాశమనే చెప్పాలి. అలాంటి అవకాశం వస్తే ఎవరూ కాదనుకోరు. కానీ సమంత ఈ ఆఫర్ను తిరస్కరించిందట. ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. షారుక్ ఖాన్తో తమిళ దర్శకుడు అట్లీ రూపొందిస్తున్న ‘జవాన్’ సినిమాకు మొదట సమంతనే నాయికగా అనుకున్నారు.
ఇది 2019లో జరిగిన సంగతి. అప్పటికి సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. కుటుంబానికి సమయం కేటాయించాలనే ఉద్దేశంతో సమంత ఈ చిత్రంలో నటించలేనని తెలిపిందట. అప్పటికి సమంతకు పెళ్లయి రెండేళ్లే అయ్యింది.
వృత్తి కంటే వ్యక్తిగత జీవితానికే సమయం ఇవ్వాలని సమంత భావించి ఉండొచ్చు. సమంత కాదనడంతో నయనతారను నాయికగా ఎంచుకున్నారు. గతేడాది నాగ చైతన్య, సమంత విడాకులు తీసుకున్నారు. ఇటీవలే టైటిల్, టీజర్ రిలీజ్ చేసిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో వచ్చే ఏడాది జూన్ 2న విడుదల కాబోతున్నది.