భారత స్వాత్రంత్య దినోత్సనం సందర్భంగా న్యూయార్క్లో ప్రతీ ఏటా ‘ఇండియా డే పరేడ్’ వేడుకలు నిర్వహిస్తారనే విషయం తెలిసిందే. ఆదివారం మధ్యాహ్నం జరిగిన ఈ వేడుకల్లో వివిధ రంగాలకు చెందిన భారతీయ ప్రముఖులు పాల్గొన్నారు. సినీ రంగం నుంచి అగ్ర కథానాయిక సమంత, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఇండియా డే పరేడ్ తాలూకు తన అనుభవాలను సమంత ట్విట్టర్ ద్వారా పంచుకుంది. భారతదేశ సంస్కృతి, సంప్రదాయాల ఔన్నత్యం ఏమిటో ఈ పరేడ్ మరోసారి గుర్తుచేసిందని సమంత వ్యాఖ్యానించింది. ‘నా జీవితంలో మరచిపోలేని మధుర ఘట్టమిది. ఈ దృశ్యాలు నా మదిలో ఎప్పటికీ నిలిచిపోయి ఉంటాయి. ఈ అరుదైన గౌరవం నాకు దక్కినందుకు చాలా సంతోషంగా ఉంది’ అని సమంత పేర్కొంది. గత సంవత్సరం జరిగిన పరేడ్లో అల్లు అర్జున్, అభిషేక్ బచ్చన్, రానా, రవీనా టాండన్ వంటి ప్రముఖులు పాల్గొన్నారు.