మయోసైటిస్ అనే అరుదైన కండరాల వ్యాధి బారిన పడి కొన్ని నెలల పాటు సినిమాలకు దూరమైంది అగ్ర కథానాయిక సమంత. ప్రస్తుతం వ్యాధి నుంచి కోలుకొని సరికొత్త ఉత్సాహంతో సినిమా షూటింగ్స్లో పాల్గొంటున్నది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘శాకుంతలం’ చిత్రం ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన ఆరోగ్యం పూర్తిగా మెరుగుపడిందని ఆనందం వ్యక్తం చేసింది సమంత. ఆమె మాట్లాడుతూ ‘వ్యాధి నిర్ధారణ జరిగిన తొలిరోజుల్లో చాలా బలహీనంగా అనిపించేది. ‘యశోద’ చిత్రం విడుదల సమయంలో ఇంకా వీక్ అయ్యా. అయినా ధైర్యం చేసి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నా. ఇంటర్వ్యూలు ఇవ్వడానికి కూడా మాత్రం ఓపిక ఉండేది కాదు. శరీరం బాగా అలసిపోయినట్లు అనిపించేది. కానీ సినిమా ప్రమోషన్ను ఓ బాధ్యతగా భావించి పూర్తి చేశాను. ఆ తర్వాత క్రమంగా నా ఆరోగ్యం కుదుటపడింది. ప్రస్తుతం ‘శాకుంతలం’ సినిమా విషయంలో చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నా. అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకొని ఇప్పుడు చాలా ధైర్యంగా ఉన్నా’ అని చెప్పింది. ప్రస్తుతం ఆమె తెలుగులో విజయ్ దేవరకొండ సరసన ‘ఖుషి’ చిత్రంలో నటిస్తున్నది. హిందీలో ‘సిటాడెల్’ వెబ్ సిరీస్లో నటిస్తున్నది.