Samantha | ప్రపంచంతో మమేకమవ్వడం సమంతకు ఇష్టం. అందుకే తాను ఏ పని చేసినా తన వ్యక్తిగత సాంఘిక మాధ్యమాల్లో పొందుపరుస్తూవుంటుందామె. తెరిచిన పుస్తకంలా బతకడం నాకిష్టం అని పలు సందర్భాల్లో సామ్ చెప్పుకొచ్చింది కూడా. ప్రస్తుతం సినిమాలకు కామా పెట్టి.. మయోసైటిస్ చికిత్స తీసుకుంటూ, పనిలో పనిగా తనకిష్టమైన ప్రదేశాలన్నింటినీ చుట్టేస్తూ.. జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నది సమంత.
తన అనుభవాలను ఎప్పటికప్పుడు తన ఇన్స్టాలో పోస్ట్ చేసే సామ్, రీసెంట్గా స్కూల్ పిల్లలతో తను దిగిన కొన్ని ఫొటోలను పోస్ట్ చేసింది. ఈ మధ్య ఓ స్కూల్ కార్యక్రమానికి హాజరై, పిల్లలతో ఫొటోలు దిగి వాటిని ఇన్స్టాలో పోస్ట్ చేస్తూ.. ‘పుస్తకం.. పెన్ను.. గురువు.. పిల్లలు.. ప్రపంచాన్ని మార్చే శక్తి ఈ నలుగురికే ఉంది’ అని ఓ క్యాప్షన్ పెట్టింది. ఈ ఫొటోలు ప్రస్తుతం బాగా వైరల్ అవుతున్నాయి. సమంతకు సేవా గుణంతోపాటు సాంఘిక బాధ్యత కూడా ఎక్కువ. పలు సందర్భాల్లో అది నిరూపణ కూడా అయ్యింది. ఇక సమంత కెరీర్ విషయానికొస్తే.. ‘ఖుషి’ తర్వాత ఆమె ఏ సినిమాకూ ఓకే చెప్పలేదు. అయితే, ఆమె చేసిన వెబ్ సిరీస్ ‘సిటాడెల్’ త్వరలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్లో సమంత, వరుణ్ధావన్ జంటగా నటించారు.