అగ్ర కథానాయిక సమంత గతకొంత కాలంగా మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. కొన్ని రోజుల పాటు ఆస్పత్రిలో చేరి చికిత్స కూడా తీసుకుంది. త్వరలోనే తాను ఈ ఆటో ఇమ్యూన్ రుగ్మత నుంచి బయటపడతానని ధీమా వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఆమె తన తదుపరి చిత్రాల షూటింగ్స్లో పాల్గొనడానికి సన్నాహాలు చేసుకుంటున్నది.
ఈ నేపథ్యంలో సమంత అనారోగ్యానికి గురయ్యారని, ఆమెను హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారని గురువారం సోషల్మీడియాలో ప్రచారం జరిగింది. ఈ వార్తలపై సమంత వ్యక్తిగత సిబ్బంది స్పందించారు. సమంత ఆరోగ్యం బాగానే ఉందని, బయట ప్రచారంలో ఉన్న వదంతులను నమ్మొద్దని కోరారు. సమంత ప్రస్తుతం ఇంటి దగ్గరే ఉన్నారని ఆమె మేనేజర్ తెలిపారు. సమంత ప్రధాన పాత్రలో నటించిన ‘యశోద’ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది.