ప్రస్తుతం అగ్ర కథానాయికలు చాలా మంది మహిళా ప్రధాన చిత్రాల వైపే మొగ్గుచూపుతున్నారు. లేడీ ఓరియెంటెడ్ నేపథ్యంలో వినూత్న కథాంశాల్ని ఎంచుకుంటూ తమ ప్రతిభను చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. అదే పంథాలో సినీ ప్రయాణం సాగిస్తున్నది సమంత. ఆమె నటిస్తున్న తాజా చిత్రం ‘శాకుంతలం’ ఇటీవలే చిత్రీకరణ పూర్తిచేసుకుంది. పౌరాణిక ఇతివృత్తంతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇదిలావుండగా సమంత మరో మహిళా ప్రధాన కథను అంగీకరించిందని తెలిసింది. వివరాల్లోకి వెళితే… తమిళ చిత్రం ‘అంబులి’తో మంచి పేరు తెచ్చుకున్నారు దర్శకద్వయం హరిశంకర్- హరీష్ నారాయణ్. హారర్ థ్రిల్లర్గా ఈ సినిమా చక్కటి ఆదరణ దక్కించుకుంది. ఈ దర్శకులిద్దరు ఇటీవలే ఓ లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ను సమంతకు వినిపించారని తెలిపింది. కథలోని ఇంట్రెస్టింగ్ పాయింట్తో పాటు తన పాత్ర చిత్రణలోని వైవిధ్యం నచ్చడంతో సమంత ఈ సినిమాకు గ్రీన్సిగ్నల్ ఇచ్చిందని అంటున్నారు. ప్రయోగాత్మక కథాంశంతో ఈ సినిమాను రూపొందించబోతున్నారని తెలిసింది. ఈ చిత్రాన్ని శ్రీదేవి మూవీస్ పతాకంపై కృష్ణప్రసాద్ నిర్మించనున్నారని సమాచారం. నవంబర్లో సెట్స్పైకి వెళ్లనున్న ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.