విడాకులు తీసుకున్న నాగచైతన్య, సమంత
ఏడడుగుల నడక నాలుగేళ్ల మజిలీని దాటకుండానే ఆగిపోయింది. పదేళ్ల ప్రణయబంధానికి అనూహ్యంగా తెరపడింది. గత రెండు మాసాలుగా వస్తున్న ఊహాగానాల్ని నిజం చేస్తూ తాము విడాకులు తీసుకున్నట్లు నాగచైతన్య, సమంత దంపతులు శనివారం అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ఇద్దరు తమ ట్విట్టర్ ఖాతాల్లో ఓ సంయుక్త ప్రకటన చేశారు. ‘సుదీర్ఘమైన చర్చల ద్వారా ఎంతో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాం. భార్యాభర్తలుగా విడిపోయి ఇకముందు సొంత దారుల్లో ప్రయాణం సాగించాలనుకుంటున్నాం. పదేళ్ల మా స్నేహబంధం ఎంతో ప్రత్యేకమైనది. అది మా హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోతుంది. ఈ కష్ట సమయంలో మా అభిమానులు, శ్రేయోభిలాషులు, మీడియా వారు మద్దతుగా నిలవాలని, మా వ్యక్తిగత గోప్యతకు విలువనివ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాం’ అని నాగచైతన్య, సమంత ట్విట్టర్లో కోరారు. విడాకుల ప్రకటన వెలువడిన వెంటనే అభిమానులు సోషల్మీడియాలో భారీ ఎత్తున రీట్వీట్లు చేశారు. డైవోర్స్ విషయం తమను షాక్కు గురిచేసిందని కొందరు ఆవేదన వ్యక్తం చేయగా… విడిపోయినా ఇద్దరూ ఉన్నతమైన జీవితాన్ని గడపాలని మరికొంతమంది అభిమానులు ఆకాంక్షించారు. విడాకుల ప్రకటనకు ముందు సమంత ఇన్స్టాగ్రామ్లో స్పందిస్తూ ‘ప్రేమ, సత్యం ఎప్పుడూ గెలుస్తాయని చరిత్ర చెబుతుంది. బలవంతులు, దుర్మార్గులు మనకు కనిపించరు కానీ వారెప్పటికైనా నశించిపోతారు’ అంటూ తాత్వికధోరణిలో వ్యాఖ్యానించింది.
రెండు నెలల క్రితం మొదలు…
రెండు మాసాల క్రితమే సమంత, చైతన్య బంధంలో మనస్పర్ధలు తలెత్తాయని తెలిసింది. సోషల్మీడియా ఖాతాల్లో ‘అక్కినేని’ అనే పేరును తొలగించింది తన పేరు మాత్రమే స్ఫురించేలా ‘ఎస్’ అనే అక్షరాన్ని పెట్టుకుంది సమంత. ఈ సంఘటనతో అక్కినేని అభిమానులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. చైతన్య, సమంత మధ్య ఏదో అనుకోనిది జరుగుతున్నదని అనుమానపడ్డారు. ఈలోగా చైసామ్ వైవాహిక బంధం గురించి మీడియాలో అనేక కథనాలు రావడం మొదలైంది. సోషల్మీడియాలో ఈ జంట విడాకులు తీసుకోబోతున్నారంటూ ప్రచారం జరిగింది. అయితే ఈ కథనాలపై వారు ఎక్కడా స్పందించలేదు. తిరుమల దర్శనం సందర్భంగా తన వైవాహిక బంధంపై వస్తున్న రూమర్స్పై స్పందించమని అడిగిన విలేకరిపై సమంత ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘గుడిలో ఇలాంటి ప్రశ్నలు అడగడానికి బుద్ధి ఉందా’ అంటూ మందలించింది. ‘లవ్స్టోరి’ ట్రైలర్ రిలీజ్ సందర్భంగా ట్విట్టర్లో సాయిపల్లవిని విష్ చేసిన సమంత సినిమాలో హీరోగా నటించిన తన భర్త చైతన్య పేరును ప్రస్తావించలేదు. అదీగాక ట్విట్టర్లో చైతన్య ఫొటోలను తరచుగా షేర్ చేసే సమంత కొద్దిరోజులగా ఎలాంటి పోస్ట్లు చేయకపోవడంతో వీరిద్దరి అనుబంధంపై అనుమానపు మేఘాలు కమ్ముకున్నాయి. ఇటీవలే ‘లవ్స్టోరి’ ప్రచార కార్యక్రమాల సందర్భంలో కూడా నాగచైతన్య విడాకుల విషయం గురించి ఎక్కడా పెదవి విప్పలేదు. విశ్వసనీయ సమాచారం ప్రకారం కొన్ని నెలల క్రితమే చైతన్య, సమంత మధ్య సఖ్యత చెడిపోయిందని..ఇద్దరి మధ్య రాజీ కుదర్చడానికి ఇరు కుటుంబాలు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో చివరకు విడాకులు తీసుకోవాలనే కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నారని చెబుతున్నారు. పరస్పర అంగీకారంతోనే ఈ దంపతులు విడిపోయినట్లు తెలిసింది.
ప్రేమ అంకురించిందలా..
‘ఏ మాయ చేసావె’ (2010) చిత్రంలో సమంత, నాగచైతన్య తొలిసారి కలిసి నటించారు. నాయికగా సమంత అరంగేట్ర చిత్రమిది. అప్పుడే సమంత, నాగచైతన్య మధ్య స్నేహం చిగురించింది. అనంతరకాలంలో తమిళ, తెలుగు సినీరంగాల్లో సమంత అగ్ర కథానాయికగా ఎదిగింది. టాలీవుడ్లో నాగచైతన్య కెరీర్ కూడా ఉపందుకుంది. కాలక్రమేణా చైతూ, సమంతల మధ్య బంధం బలపడుతూ వచ్చింది. వీరిద్దరూ కలిసి ‘ఆటోనగర్ సూర్య’ ‘మనం’ ‘మజిలీ’ చిత్రాల్లో నటించారు. దాదాపు ఏడేళ్ల ప్రేమాయణం అనంతరం 2017 అక్టోబర్లో ఈ జంట గోవాలో వివాహం చేసుకున్నారు.
భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలి
నాగచైతన్య-సమంత విడాకులపై నాగార్జున స్పందించారు. ఈ సందర్భంగా ట్విట్టర్లో ఓ ప్రకటన చేశారు. చైతన్య, సమంత విడాకులు తీసుకోవడం చాలా దురదృష్టకరమన్నారు. ‘భార్యాభర్తల మధ్య ఏం జరిగిందన్నది వారి వ్యక్తిగత విషయం. సమంత, చైతన్య ఇద్దరు నాకు ప్రియమైన వారే. మా కుటుంబంతో సమంత గడిపిన మధురక్షణాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. భగవంతుడు ఇద్దరికి ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నా’ అని నాగార్జున వ్యాఖ్యానించారు.