Samantha | గాడ్ఫాదర్ లేకుండా సినీరంగంలో నిలదొక్కుకోవడం అంటే చిన్న విషయం కాదు. అందులోనూ ఒక అమ్మాయి ఇండస్ట్రీ రాణించాలంటే ఎన్నో సవాళ్లను, మరెన్నో వివాదాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాటిన్నిటి అధిగమించి దశాబ్దానికి పైగా టాలీవుడ్లో చక్రం తిప్పిన కథానాయిక సమంత. ‘ఏమాయ చేసావే’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ మద్రాసి సోయగం అనతి కాలంలోనే అగ్ర హీరోలతో జోడీ కట్టి టాలీవుడ్లో ఎక్కడ లేని క్రేజ్ తెచ్చుకుంది. ప్రస్తుతం హీరోల కంటే తానేమి తక్కువ కాదని లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర తన సత్తా చూపిస్తుంది.
కాగా గతేడాది సమంత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడిన విషయం చెప్పి అందరిని షాక్కు గురిచేసింది. ప్రస్తుతం ఆ వ్యాధి నుండి కోలుకుంటుంది. ఎవరి సాయం లేకున్నా ఒంటిరిగా పోరాడుతూ సినిమాల్లోనే కాదు నిజజీవితంలోనూ తను సక్సెస్ అని నిరూపించుకుంటుంది. ఈ వ్యాధి కారణంగా గతకొన్ని నెలలుగా షూటింగ్లకు బ్రేక్ ఇచ్చిన సమంత.. ఇటీవలే ఫ్యామిలీమ్యాన్ రూపకర్తలు తెరకెక్కిస్తున్న ‘సిటాడెల్’ వెబ్సిరీస్ కోసం కెమెరా ముందుకు వచ్చింది. రీసెంట్గానే ఈ వెబ్సిరీస్లోని సమంత లుక్ బయటకు వచ్చింది. స్టైలిష్ కాప్గా సామ్ లుక్కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. కాగా ఇన్ని రోజులు తను ఎదుర్కొన్న ఇబ్బందులను తలుచుకుంటూ సామ్ పలు ఫోటోలను ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తూ ఓ ఎమోషనల్ పోస్ట్ను పెట్టింది.
‘గట్టిగా ఊపిరి పీల్చుకో పాప. త్వరలో అన్నీ చక్కబడతాయని నేను నీకు మాటిస్తున్నా. గడిచిన ఏడెనిమిది నెలలుగా నువ్వు అత్యంత ఇబ్బందికరమైన రోజులు చూస్తూ ముందుకు సాగావు. వాటిని మర్చిపోవద్దు. ఆ క్లిష్ట పరిస్థుతులను ఎలా ఎదుర్కొన్నావో ఎప్పటికీ గర్తుపెట్టుకో. అన్ని ఇబ్బందులను తట్టుకుని ధైర్యంగా అడుగులేశావు. నీ విషయంలో ఎంతో గర్వంగా ఉన్నా. నువ్వు కూడా నాలాగే గర్వపడు. ధైర్యంగా మరింత ముందుకు సాగిపో’ అంటూ తనకు తనే చెబుతున్నట్లుగా సమంత ఓ నోట్ను రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
ప్రస్తుతం సామ్ ప్రధాన పాత్రలో నటించిన పాన్ ఇండియా మూవీ ‘శాకుంతలం’ రిలీజ్కు సిద్ధంగా ఉంది. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ముందుగా మహాశివరాత్రి కానుకగా రిలీజ్ చేయాలని అనుకున్నా.. పఠాన్ జోరు ఇంకా కొనసాగుతుండటంతో విడుదల తేదీని వాయిదా వేసినట్లు తెలుస్తుంది. ఇక దీనితో పాటు విజయ్తో కలిసి ‘ఖుషీ’ మూవీ చేస్తుంది. గతేడాదే రెండు షెడ్యూల్స్ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో మూడో షెడ్యూల్ ప్రారంభించనుంది.