Samantha | అగ్ర కథానాయిక సమంత ప్రస్తుతం తన ఆరోగ్యంపై దృష్టి పెట్టింది. ఇటీవలే ‘సిటాడెల్’ హిందీ రీమేక్ షూటింగ్ను పూర్తి చేసుకున్న ఆమె ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ తీసుకోబోతున్నట్లు ప్రకటించింది. మయోసైటిస్ చికిత్స కోసం సమంత విదేశాలకు వెళ్లనుందని తెలిసింది. ఈ నేపథ్యంలో మానసిక ప్రశాంతత కోసం సమంత ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శిస్తున్నది. ఇటీవలే కోయంబత్తూర్లోని ఈషా ఫౌండేషన్ను సందర్శించి అక్కడ నిర్వహించిన ధ్యాన శిబిరంలో పాల్గొంది. పూర్తిగా ధ్యానంలో నిమగ్నమై ప్రశాంత వదనంతో కనిపిస్తున్న తన ఫొటోలను ఇన్స్టాగ్రామ్లో పంచుకుంది.
‘ఎడతెగని ఆలోచనలతో ప్రశాంతంగా ఉండటం చాలా కష్టమనిపించేది. కానీ ఈ రోజు ధ్యానంతో నా మనసు పూర్తిగా కుదుటపడింది. నా ఆలోచనల్లో స్పష్టత రావడంతో పాటు ఏదో తెలియని ప్రశాంత స్థితికి చేరుకున్నాననే భావన కలుగుతున్నది. ధ్యానం నాలో పునరుత్తేజాన్ని నింపింది. అతి సాధారణంగా కనిపించే కొన్ని విషయాలు అత్యంత శక్తివంతమైనవని అర్థం చేసుకున్నా’ అంటూ సమంత వ్యాఖ్యానించింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్మీడియాలో వైరల్గా మారాయి. విజయ్ దేవరకొండతో కలిసి ఆమె నటించిన తాజా చిత్రం ‘ఖుషి’ సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకురానుంది.