నాగ చైతన్య నుండి విడాకులు తీసుకున్న తర్వాత సమంతపై ఎన్ని విమర్శలు వచ్చాయో మనం చూశాం. తప్పంతా తనదేనంటూ ఓ వర్గం ఆమెని టార్గెట్ చేస్తూ తెగ ట్రోల్ చేశారు. కాని ఇప్పుడు ఈ విషయం తెలుసుకొని ప్రశంసలు కురిపిస్తున్నారు. అందుకు కారణం ఆపదలో ఉన్న హీరోయిన్కి సమంత తన వంతు సాయం చేయడమే. ఐస్క్రీమ్ చిత్రంతో పాపులారిటీ పెంచుకున్న తేజస్వీ ఓ ఇంటర్వ్యూలో సమంత చేసిన సాయం గురించి చెప్పింది.
తేజస్వి మడివాడకి చిన్నప్పుడు తల్లి చనిపోయింది. తండ్రి తాగుడుకి బానిసైయ్యాడు. దాంతో డబ్బులకు తేజస్వి ఇబ్బందులు పడింది. కాస్త వయసు పెరిగిన తర్వాత ఇంటి నుంచి బయటకు వచ్చేసి కాలేజీ క్యాంపస్లలో, శరణాలయాల్లో ఉంటూ వచ్చిందట తేజస్వి. ఇక సినిమాలలో చిన్న పాత్రలు చేయడం ద్వారా వచ్చే డబ్బులు ఆమె అవసరాలకు సరిపోయేవి. దాచుకునేంత డబ్బులు ఏవీ మిగల్లేదు. ఈ క్రమంలో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా చేసేటప్పుడు, తేజస్వికి టీబీ వచ్చింది.
డాక్టర్స్ ఆపరేషన్ చేయాలన్నారు. కానీ తేజస్వి దగ్గర అంత డబ్బులు లేవట. విషయం తెలుసుకున్న సమంత ఆపరేషన్కు అయ్యే ఖర్చుని తానే భరించిందట. ఈ విషయం పాతదే అయిన ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుండగా, ప్రతి ఒక్కరు సమంత మంచి తనంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా, సమంత.. ప్రత్యూష అనే ఫౌండేషన్ ద్వారా పిల్లలకు సాయం చేస్తున్న విషయం తెలిసిందే.