Salman Khan | బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి కాంబినేషన్లో తెరకెక్కనున్న భారీ చిత్రం అధికారికంగా ప్రారంభమైంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ శుక్రవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సందర్భంగా విడుదలైన ప్రత్యేక వీడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వైరల్ అవుతోంది. షూటింగ్ ప్రారంభంపై స్పందించిన సల్మాన్ ఖాన్, ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ను వచ్చే ఏడాది ఈద్ పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపారు. సినిమా విడుదలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ నిరాశ చెందవద్దు. మీ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా ఉంటుంది అని అభిమానులకు హామీ ఇచ్చారు. ప్రతి ఏడాది ఈద్ సందర్భంగా ఆయన సినిమాలు విడుదలై భారీ విజయాలు సాధించడం తెలిసిందే.
ఈ సినిమాలో సల్మాన్ సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్గా నటిస్తున్నారు. తెలుగు చిత్రసీమలో విజయవంతమైన సినిమాలతో గుర్తింపు పొందిన వంశీ పైడిపల్లి ఈ సినిమాతో హిందీ చిత్రసీమలో అడుగుపెడుతున్నారు. సల్మాన్ ఖాన్ ఇమేజ్కు తగ్గట్టుగా యాక్షన్, భావోద్వేగాల మేళవింపుతో కథ సిద్ధం చేసినట్లు సమాచారం. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు ఈ చిత్రాన్ని అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. ఉన్నత సాంకేతిక ప్రమాణాలతో, ప్రేక్షకులను ఆకట్టుకునే యాక్షన్ సన్నివేశాలతో సినిమా రూపొందనుందని సినీ వర్గాలు చెబుతున్నాయి.
బాలీవుడ్ స్టార్ హీరో, టాలీవుడ్ హిట్ దర్శకుడు కలయికలో వస్తున్న ఈ చిత్రం అభిమానుల్లో భారీ అంచనాలు రేకెత్తిస్తోంది. ఈద్ విడుదల లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఈ సినిమా, సల్మాన్ ఖాన్ కెరీర్లో మరో విజయవంతమైన చిత్రంగా నిలుస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. కాగా, గత కొన్నాళ్లుగా సల్మాన్ ఖాన్ హిట్స్ అందించలేక నిరాశలో ఉన్నారు.టాలీవుడ్ డైరెక్టర్తో చేస్తున్న సినిమాతో అయిన మంచి హిట్ అందుకుంటాడా అనేది చూడాలి.