Salman Khan | గత కొన్ని రోజులుగా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరుతో వస్తున్న బెదిరింపులు బాలీవుడ్ను కలవరపెడుతున్నాయి. ఇప్పటికే స్టార్ హీరో సల్మాన్ ఖాన్ను చంపేస్తామంటూ పలుమార్లు హెచ్చరికలు జారీ చేసింది. ఈ గ్యాంగ్ కారణంగా ఆయన కట్టుదిట్టమైన భద్రత నడుమే బయటకు వస్తున్నారు. ఇప్పుడు అదే బెదిరింపుల పరంపర మరోమారు తీవ్రతరమవుతూ ఇతర నటుల వరకు విస్తరించడం సినీ వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. రెండు రోజుల క్రితం బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్కు కూడా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు వచ్చినట్లు సమాచారం. ఈ విషయంపై రణవీర్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెంటనే భద్రతను పెంచినట్లు తెలుస్తోంది. ఆయన కుటుంబ సభ్యులకు కూడా అదనపు రక్షణ కల్పించినట్లు సమాచారం. ఈ ఘటనతో బాలీవుడ్ ప్రముఖులు మరింత అప్రమత్తమయ్యారు.
ఇంతలో తాజాగా సల్మాన్ ఖాన్ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని మరో బెదిరింపు వెలుగులోకి వచ్చింది. సల్మాన్ ఖాన్ చెల్లెలు అర్పిత ఖాన్ భర్త, నటుడు ఆయుష్ శర్మకు బెదిరింపులతో కూడిన ఓ ఈ మెయిల్ వచ్చినట్లు వెల్లడైంది. ఆ మెయిల్ను వెంటనే పోలీసులకు చూపించి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ ఈ మెయిల్ కూడా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచే వచ్చి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. రణవీర్ సింగ్కు వాట్సాప్ ద్వారా బెదిరింపులు వచ్చినట్టు, ఆయుష్ శర్మకు ఈ మెయిల్ ద్వారా హెచ్చరికలు రావడం గమనార్హం. మెయిల్ను ట్రేస్ చేయకుండా ఉండేందుకు VPN వాడినట్లు ప్రాథమిక సమాచారం వెల్లడవుతోంది. దీంతో పోలీసులు సైబర్ క్రైమ్ విభాగం సహాయంతో ఈ కేసులపై లోతైన విచారణ చేపట్టారు. మెయిల్స్, మెసేజెస్ మూలాలను గుర్తించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
మొన్న సల్మాన్ ఖాన్, తర్వాత రణవీర్ సింగ్, ఇప్పుడు ఆయుష్ శర్మ… ఇలా వరుసగా బాలీవుడ్ ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని బెదిరింపులు రావడం సినీ పరిశ్రమలో భయాందోళనలు రేకెత్తిస్తోంది. ప్రముఖులు తమ భద్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ జాగ్రత్తలు పెంచుతున్నారు. పోలీసులు కూడా ఈ అంశాన్ని అత్యంత సీరియస్గా తీసుకుని గ్యాంగ్ కార్యకలాపాలపై నిఘా కట్టుదిట్టం చేశారు. ప్రస్తుతం ఈ బెదిరింపుల వెనుక అసలు నిజం ఏమిటి, ఎవరు ఉన్నారు అన్నది వెలుగులోకి రావాల్సి ఉంది.