Salman Khan | బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సల్మాన్ ఖాన్ గురించి ప్రస్తుతం ఓ సంచలన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తనకు చెందిన దాదాపు రూ.3,000 కోట్ల విలువైన ఆస్తులను కుటుంబ సభ్యులకు పంచివేయాలని ఆయన నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వార్త బయటకు రావడంతో అభిమానులతో పాటు సినీ వర్గాల్లో కూడా పెద్ద చర్చ మొదలైంది. అంత పెద్ద మొత్తాన్ని అకస్మాత్తుగా పంచివేయాలని ఎందుకు నిర్ణయించుకున్నారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ నిర్ణయం వెనుక ప్రధాన కారణంగా ఆయన గతంలో ఎదుర్కొన్న ఆరోగ్య సమస్యలను చూపిస్తున్నారు.
సల్మాన్ ఖాన్ ఒకసారి ఇంటర్వ్యూలో తాను ట్రైజెమినల్ న్యూరల్జియా అనే అరుదైన నరాల వ్యాధితో బాధపడినట్లు వెల్లడించారు. ఈ వ్యాధిని “సూసైడ్ డిసీజ్” అని కూడా పిలుస్తారు. ఈ సమస్య వల్ల ముఖంలో తీవ్రమైన, ఎలక్ట్రిక్ షాక్లాంటి నొప్పులు వస్తాయని, ఒక దశలో ఆ బాధ తట్టుకోలేక ఆత్మహత్య ఆలోచనల వరకు వెళ్లానని ఆయన స్వయంగా చెప్పిన విషయం తెలిసిందే. అనంతరం లండన్ లో చికిత్స తీసుకుని కోలుకున్నట్లు సమాచారం.ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంతో సినిమాలు చేస్తున్నప్పటికీ, భవిష్యత్తులో కుటుంబ సభ్యులు ఎలాంటి ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ముందుగానే ఆస్తుల పంపకం పూర్తి చేయాలని సల్మాన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. తన సోదరులు, సోదరీమణులకి సమానంగా ఆస్తులను పంచాలనే ఆలోచనలో ఉన్నారని సమాచారం.
అయితే ఈ వార్తలపై ఇప్పటివరకు సల్మాన్ ఖాన్ లేదా ఆయన కుటుంబ సభ్యుల నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. దీంతో ఇది నిజమా? లేక సోషల్ మీడియాలో వస్తున్న ఊహాగానాలేనా? అన్నది ఇంకా స్పష్టత రాలేదు. ఈ వార్తల నేపథ్యంలో అభిమానులు సోషల్ మీడియాలో విభిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు ఆయన కుటుంబంపై ఉన్న ప్రేమను ప్రశంసిస్తుంటే, మరికొందరు ఇలాంటి పెద్ద నిర్ణయం తీసుకునే ముందు అధికారిక ప్రకటన చేయాల్సిందేనని అంటున్నారు.